ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 22న అమెరికాలో పర్యటిస్తారనగా అంతకన్నా ముందే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ నెలాఖరున వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 30 లేదా 31వ తేదీన అమెరికా దేశానికి బయలుదేరే రాహుల్ గాంధీ అక్కడ కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూయార్క్ సందర్శిస్తారని తెలిపాయి. తన పర్యటనలో భాగంగా ఆయన ప్రవాస భారతీయలతో పాటు ఒకానొక యూనివర్శిటీ నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత పాల్గొంటారని తెలిపాయి.
జూన్ నాల్గవ తేదీన న్యూయార్క్లోని మ్యాడిసన్ స్క్వేర్ వద్ద ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈ ఏడాది మొదట్లో యూకే సందర్శించిన కాంగ్రెస్ నేత అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత ప్రధాని మోడీ అధికారిక అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 22న ప్రధానికి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆతిథ్యమిస్తారని వైట్హౌస్ వర్గాలు గతవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి.