Thursday, May 2, 2024

తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు: రేవంత్

తెలంగాణలో ప్రత్యర్థుల అంచనాలను చిత్తు చేయడంలో కేసీఆర్ దిట్ట. అందుకే 2019లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల కోసం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ప్రతిపక్షాలకు పాలుపోలేదు. తక్కువ సమయంలో వారి వ్యూహాలు పారలేదు. అయితే తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. ఈ మేరకు 2022 డిసెంబరులో ప్రభుత్వాన్ని రద్దు చేసి 2023 మొదట్లో ఎన్నికలకు వెళ్తారని ఆయన జోస్యం చెప్పారు. అందుకే గతంలో తమకు ఎదురైన ఘటనలను దృష్టిలో ఉంచుకుని అలా కాకుండా ఈసారి చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ వివరించారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొందరు ముందస్తు ఎన్నికలు రావని అంటున్నారని.. ఈ మాట 100కి 100 శాతం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. గతంలో తాను ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పానని.. తాను చెప్పినట్లే ముందస్తు ఎన్నికలు వచ్చాయని గుర్తుచేశారు. అంతేకాకుండా తాను ఈటెలను పార్టీ నుంచి గెంటేస్తారని చెప్పానని.. అది కూడా జరిగిందని రేవంత్ అంటున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తారని అందరూ భావించినా.. తాను ఆ అవకాశం లేదని కూడా చెప్పానని రేవంత్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ చెప్పినట్లు మరోసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

ఈ వార్త కూడా చదవండి: ‘గెల్లు’ టిక్కెట్‌కు బాల్క ముల్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement