Monday, May 13, 2024

రేపు టెన్త్‌ రిజల్ట్​.. జూలై 1న టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పదో తరగతి, టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. రేపు (30న) టెన్త్‌ ఫలితాలు, జూలై 1న టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లిdహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లో పదో తరగతి ఫలితాలను మంత్రి విడుదల చేయనున్నారు. మే 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

విద్యాశాఖలో భారీగా టీచర్ల ఖాళీలు ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు ముందడుగు వేసింది. ఐదేళ్ల తర్వాత టెట్‌ను నిర్వహించింది. ఈసారి టెట్‌కు అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 12న టెట్‌ పరీక్షను అధికారులు నిర్వహించారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27న టెట్‌ ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే జూన్‌ 15న ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో 18వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. టెట్‌ పరీక్షా పేపర్లలో చాలా తప్పులు దొర్లినట్లు గుర్తించారు. దీంతో అభ్యర్థుల నుంచి భారీగానే అభ్యంతరాలు రావడంతో వాటిని పరిశీలించి ఫైనల్‌ కీ ఇవ్వాల్సి ఉంటుంది. అది వచ్చిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తారు. కానీ అధికారులు ఇప్పటి వరకు టెట్‌ ఫైనల్‌ కీ విడుదల చేయలేదు. ఈ క్రమంలో టెట్‌ ఫలితాలను జూలై 1న విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మంగళవారం మంత్రి తన కార్యాలయంలో టెట్‌, టెన్త్‌ ఫలితాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్శంగా మంత్రి మాట్లాడుతూ టెట్‌ ఫలితాల వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జూలై 1న ఫలితాలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రేపు టెన్త్‌, జూలై 1న టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement