సుప్రసిద్ధ విప్లవ రచయిత శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీ శ్రీ) కుమార్తె నిడమోలు మాలా మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో మాలా, ఎస్.సౌందర్ల పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశ్రీ-సరోజా దంపతుల నాలుగో సంతానమే మాలా. మద్రాస్ లా కళాశాల నుంచి డిగ్రీ పొందారు. 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నతాధికారిగా ఉన్నారు. వారిది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా. మాలా-రాధారమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ జయప్రకాష్ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 9మంది నియామకం..
సుప్రీం కోర్టు కొలీజియం కొత్తగా 9 మందిని దేశంలోని ఐదు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించింది. వీరిలో ఆరుగురు న్యాయవాదులు, మిగిలిన ముగ్గురు జ్యుడీషియల్ అధికారులని న్యాయమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. న్యాయవాదులైన రాహుల్ భర్తీ, మోక్షా ఖజురియా కాజ్మీలను జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. వీరిలో తొలుత ఖాజ్మీని 2019 అక్టోబర్లో, రాహుల్ను గతేడాది మార్చిలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేయగా.. ఆ ఇద్దరి పేర్లను గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది. దీంతో గతేడాది చివరిలో వీరిద్దరి పేర్లను మరోసారి సుప్రీం కొలీజియం సిఫారసు చేయగా.. ఎట్టకేలకు కేంద్రం ఆమోదించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..