Friday, April 26, 2024

Elon Musk | భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు.. లైసెన్స్‌ ఇస్తే చాలన్న మస్క్‌

అమెరికా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం తరువాత ఇండియాలో టెస్లా కారు ప్లాంట్‌ను సాధ్యమైనంత తర్వగా ప్రారంభిస్తామని ఎలాన్‌మస్క్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇండియాలో స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించడం పట్ల మస్క్‌ ఆసక్తి వ్యక్తం చేశారు. స్టార్‌లింక్‌తో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకు రావచ్చని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. రెండు సంవత్సరాల క్రితమే శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు స్టార్‌లింక్‌ ప్రయత్నించింది.

ఆ సమయంలో పలు కారణాల మూలంగా అది సాధ్యం కాలేదు. భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించేందుకు స్పెక్ట్రమ్‌, ఎయిర్‌వేస్‌లకు లైసెన్స్‌ ఇవ్వాలని స్టార్‌ లింక్‌ కోరుతున్నది. ఇదే విధానం ఉండాలని టాటా, భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌, అమెజాన్‌ క్యూపర్‌ సంస్థలు కోరుతున్నాయి. ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ మాత్రం భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను అందించే విదేశీ సంస్థలకు ప్రభుత్వం వేలం నిర్వహించాలని కోరుతోంది. భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత సేవలకు సంబంధించి స్పెక్ట్రమ్‌ వేలంపై నిర్ణయం కీలకమని టెలికం రంగ నిపుణులు అభిప్రాయపడుడుతన్నారు.

- Advertisement -

మొబైల్‌ స్పెక్ట్రమ్‌ వేలం తరహాలోనే శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవల కోసం ఉపయోగించే ఎల్‌ బ్యాండ్‌, ఎస్‌ బ్యాండ్‌ల వేలం నిర్వహించాలని రిలయన్స్‌ జియో, హోడాపోన్‌ ఐడియా సంస్థలు కోరుతున్నాయి. దేశీయ సంస్థలైన టాటా, భారతీ ఎయిర్‌టెల్‌ వన్‌వెబ్‌, ఎల్‌ అండ్‌ టీతో పాటు, విదేశీ సంస్థలైన స్టార్‌లింక్‌, అమెజాన్‌ క్యూపర్‌ వంటి సంస్థలు వేలం బదులు నేరుగా కేటాయించాలని కోరుతున్నాయి.

దేశంలోని విదేశీ సంస్థల పెట్టుబడులు రాబట్టాలంటే వేలం నిర్వహించడమే సరైన నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని టెలికం రంగంలో ఒక ఉన్నతాధికారి తెలిపారు. దీని వల్ల ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌పై కొంత వరకు నియంత్రణ లభిస్తుందని కేంద్రం భావిస్తోందని ఆ అధికారి వెల్లడించారు. భారత్‌లో వన్‌వెబ్‌ ఇండియా, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌లకు టెలికం విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాలను మాత్రం ఇంకా రూపొందించలేదు. విదేశీ సంస్థలు భారత్‌లో తమ సర్వీస్‌లను ప్రారంభించాలని భావిస్తున్నాయి. ఆయా సంస్థలు వేలానికి బదులు లైసెన్స్‌లు జారీ చేయాలని కోరుతున్నాయి. దీనిపై కేంద్రం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2030 నాటికి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవల మార్కెట్‌ విలువ 36 శాతం పెరుగుతుందని డెలాయిట్‌ సంస్థ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement