Thursday, May 2, 2024

2030 నాటికి పెరగనున్న పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం.. ఆయుష్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి కాప్‌ 26 సదస్సులో చేసిన ప్రకటనకు అనుగుణంగా దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర స్థాపిత పునరుద్పాక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ మంగళవారం రాతపూర్వకంగా జవాబిచ్చారు. పునరుత్పాదక ఇంధన రంగంలో 28 ఫిబ్రవరి 2022 నాటికి 152 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యాన్ని సాధించినట్లు ఆయన చెప్పారు. ఇందులో అతిపెద్ద జలవిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మరో 72.61 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రాజెక్ట్‌లు వేర్వేరు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 21.11 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రాజెక్ట్‌లు టెండరు దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. గడిచిన మూడేళ్ళలో 2019-20లో 9,061 మెగావాట్లు, 2020-21లో 7866 మెగావాట్లు 2021-22 ఫిబ్రవరి నాటికి 10,786 మెగా వాట్ల స్థాపిత శక్తితో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌ల ఏర్పాటు జరిగినట్లు మంత్రి వివరించారు. కోవిడ్‌ కారణంగా 2020-21లో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులలో జాప్యం జరిగిందని చెప్పారు. దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్‌లలో అత్యధిక ప్రైవేట్‌ రంగ డెవలపర్స్‌ ద్వారా జరుగుతున్నట్లు చెప్పారు. 25 ఏళ్ళ పాటు టారిఫ్‌ నికరంగా ఉంటుందన్న హామీ కారణంగా జరిగే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల వలన ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసం కలిగించినట్లు ఆర్కే సింగ్‌ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2015-16 నుంచి 2021 ఫిబ్రవరి వరకు పునరుద్పాదకయేతర విద్యుత్‌ రంగంలో 4,138 మెగా వాట్ల స్థాపిత సామర్ధ్య అదనంగా వచ్చినట్లు ఆయన వివరించారు.ఆయుష్‌ విద్యాసంస్థల స్థాపన రాష్ట్రాల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఒక ఆయుర్వేదిక్‌, మూడు హూమియో ఆయుష్‌ విద్యా సంస్థలు ఉన్నట్లు కేంద్ర ఆయుష్‌ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రజారోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. ఆయుష్‌ విద్యాసంస్థల స్థాపన ఆయా రాష్ట్రాల పరిధిలోకి వస్తుందన్నారు. అయితే కేంద్ర ప్రాయోజిత పథకం అయిన జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద కొత్తగా ఏర్పాటు చేసే ఆయుష్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి చెప్పారు. జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద విశాఖపట్నంలోని ప్రభుత్వ నేచురోపతి, యోగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం 2016-17లో 3 కోట్ల 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్లు సోనోవాల్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement