Sunday, April 28, 2024

Uganda School Attack : పాఠ‌శాల‌​పై తిరుగుబాటుదారులు దాడి.. 41 మంది మృతి

తిరుగుబాటు దారులు ఓ పాఠశాలపై దాడి చేయడంతో 41మంది చనిపోయిన ఘటన ఉగాండాలో చోటుచేసుకుంది. ఓ పాఠశాలపై ISISతో సంబంధాలున్న ఏడీఎఫ్​ సంస్థకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 41 మంది మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. ఈ పాఠశాల కాంగో సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మృతులు విద్యార్థులా లేదా సాధారణ పౌరులా అనేది ఇంకా తెలియలేదు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై ఉగాండా పోలీసులు మాట్లాడుతూ…. దేశ సరిహద్దు పట్టణమైన మాండ్వేలోని లుబిరిహా సెకండరీ పాఠశాలపై శుక్రవారం అర్ధరాత్రి ఏడీఎఫ్​కు చెందిన తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారన్నారు. పాఠశాల వసతి గృహాన్ని తిరుగుబాటుదారులు తగులబెట్టారన్నారు. పాఠశాల నుంచి 41 మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. బ్వేరా ఆసుపత్రికి తరలించామ‌న్నారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ఆస్పత్రికి తరలించామ‌న్నారు. అలాగే పాఠశాలపై తిరుగుబాటుదారులు చేసిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ఉగాండా రాజకీయ నాయకురాలు విన్నీ కిజా. పాఠశాలలపై దాడులు ఆమోదయోగ్యం కాదని.. ఆమె అన్నారు. స్కూళ్లు విద్యార్థులకు ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశంగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement