హైదరాబాద్ : ఎవరి ఆహార్యాన్నైనా గౌరవించాలని, . తలనుంచి పాదాల వరకు కప్పి ఉంచే దుస్తుల విషయంలో గొడవ తగదని అన్నారు హోంమంత్రి మహమూద్ అలీ.. హైదరాబాద్లోని ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ ధరించిన విద్యార్ధినులను పరీక్షకు అనుమతించకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు.. వివాదం మీద హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. అమ్మాయిలు ఏ దుస్తులు వేసుకున్నా సమస్య కాదు… అయితే పొట్టి దుస్తులు వేసుకోవడంతోనే సమస్యలు కొన్ని సందర్బాలలో వస్తున్నాయని అన్నారు.. దీనిని కొందరు వివాదంగా మార్చి సోషల్ మీడియాలో హోంమంత్రిపై ట్రోల్ చేస్తున్నారు.. దీనిపై కూడా ఆయన స్పందిస్తూ తాను మహిళలపై ఎన్నడూ అగౌరవ వ్యాఖ్యాలు చేయలేదని, అలాగే వారు ధరించే డ్రస్ విషయంలోనూ తాను అభ్యంతరం తెలపలేదని వివరణ ఇచ్చారు..
ఇదిలా ఉండగా, శనివారం ఉదయం హైదరాబాద్లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వబోమని చెప్పడం వివాదానికి దారితీసింది. పలువురు ముస్లిం విద్యార్థినులు శుక్రవారం నిర్వహించిన డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు హిజాబ్ ధరించి వచ్చారు. అయితే. పరీక్షా కేంద్రంలోకి వారిని కాలేజీ సిబ్బంది అనుమతించడానికి నిరాకరించింది. హిజాబ్తో రావద్దని సూచించారు. అలా చెప్పడంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది. వారితో గొడవెందుకనుకున్న కొంతమంది విద్యార్థినులు హిజాబ్ తీసేసి పరీక్షా కేంద్రంలోకి వెళ్లినట్టుగా సమాచారం. కాసేపటికి.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హిజాబ్తోనే విద్యార్థినులను పరీక్షకు అనుమతించారు. దీనిమీద విద్యార్థినులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అరగంటపాటు తమను ఆపేశారని చెప్పుకొచ్చారు. చివరకు హిజాబ్ తీసేసిన తరువాత లోనికి అనుమతించారన్నారు.
గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదన్నారు.
మర్నాటి పరీక్షకు హిజాబ్ లేకుండానే రావాలని కాలేజ్ యాజమాన్యం చెప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ, ముస్లిం మహిళలకు హిజాబ్ అనేది సర్వసాధారణమని చెప్పారు. పరీక్షా కేంద్రంలోకి హిజాబ్తో విద్యార్థినులను అనుమతించకపోవడంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. హిజాబ్ తో పరీక్షలు రాయవచ్చని ఆయన స్పష్టం చేశారు..