Thursday, May 16, 2024

Delhi: గిడుగు స్ఫూర్తితో భాషా సంస్కృతుల పరిరక్షణ.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కార్యక్రమంలో వెంకయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భాషా సంస్కృతులే భవిష్యత్తులో మన చిరునామాను తెలియజేస్తాయని, అలాంటి భాషను, సంస్కృతిని కాపాడుకోవడమే తెలుగు భాషా దినోత్సవ సంకల్పం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుని ఆయనకు నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు, ప్రతి ఒక్కరికీ మాతృభాషను చేరువ చేయాలన్న గిడుగు స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని అమ్మభాషను కాపాడుకునేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

భారతదేశం స్వరాజ్యం సంపాదించుకున్న 75 ఏళ్ళలో విదేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో భారతీయులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటీష్ గడ్డ మీద భారతీయులకు ఈ రోజు అందుతున్న గౌరవం చూస్తుంటే గర్వంగా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. వసుధైవ కుటుంబ భావనను బలంగా నమ్మిన భారతీయులు సనాతన కాలం నుంచి కోరుకున్న నిజమైన పురోభివృద్ధి ఇదేనని పేర్కొన్నారు. మన భాషా సంస్కృతులను కాపాడుకుంటూ, ముందు తరాలకు చేరవేయాలన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ సంస్థకు అభినందనలు తెలియజేసిన వెంకయ్యనాయుడు, కాలానుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆదర్శనీయమని తెలిపారు.

దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, ఈ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చారన్న వెంకయ్యనాయుడు, ఈ భావన మానవాళి పురోభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ వేడుక లక్ష్యం, వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదని, స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల ప్రేరణను ముందు తరాల్లో నింపటమని స్పష్టం చేశారు. అతి బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్, గత 75 ఏళ్ళలో వ్యాక్సిన్ కోసం విదేశాల మీద ఆధారపడే స్థాయి నుంచి, దేశ విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం నిజమైన పురోగతి అని స్పష్టం చేశారు.

- Advertisement -

భాష అంటే మనం మాట్లాడే నాలుగు పలుకులే కాదన్న వెంకయ్య, మన పిల్లలకు మన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దటం మాత్రమే గాక, మన పండుగల్లోని పరమార్థాన్ని తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించాలన్న ఆయన, తెలుగు కవులు నవ్యమార్గంలో యువతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మన ప్రాచీన గ్రంథాల్లో మన సంస్కృతి మాత్రమే గాక, సాంఘిక జీవనం కూడా భాగమై ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ముందు తరాలకు అందజేయాలని స్పష్టం చేశారు.

భాషను కాపాడుకోవడంతో పాటు నలుగురికీ సాయం చేయడం మరవొద్దని వెంకయ్యనాయుడు, కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ప్రవాస భారతీయులు చూపిన చొరవ దేశం మరువదని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కార్యనిర్వాహక వర్గంతో పాటు, బ్రిటన్ లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement