Saturday, April 27, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన క‌పిల్ శ‌ర్మ‌..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ మొక్క‌లు నాటారు. ముంబయిలోని గోరేగాన్‌లోని దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీలో ఎంపీ జీ సంతోష్‌కుమార్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని క‌పిల్ శ‌ర్మ‌ మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌న నవ్వులు శాశ్వతంగా ఉండాలంటే మొక్కలు నాటాలన్నారు. మనిషికి సరిపడా ఆక్సిజన్‌ దొరికినప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారని దాంతో ప్రతీ సంఘటనను పాజిటివ్‌గా తీసుకునే శక్తి మెదడుకు అందుతుందన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం ఎంతో ఉన్నత ఆశయంతో కూడుకున్నదన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమం తన మనసును కదిలిచిందన్నారు. ‘మనం మన కోసం కాదు.. ఇతరుల కోసం కూడా’ అనే భావనను తనలో కలిగించిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ నేలపై మన భవిష్యత్ తరాలు బాగుండాలని తలపెట్టిన ఓ అద్భుతమైన కార్యక్రమమని ప్రశంసించారు. దీన్ని ఓ కార్యక్రమంలా కాకుండా.. మన బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. యావత్ దేశ ప్రజలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని తాను కోరుకుంటున్నానని, తన షోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ పచ్చని ఆశయానికి అండగా నిలువాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వర్షా కాలంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతారని ఆశిస్తున్నట్లు కపిల్‌ శర్మ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement