Thursday, May 16, 2024

Big Story | ఇంకా రెండు నెలలు… ఓటరన్న ప్రసన్నానికి పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రెండు నెలలపాటు ఎన్నికల హోరు కొనసాగనుంది. ప్రజలను కలుసుకునేందుకు సమయం దొరికిందని కొందరు, అమ్మో ఖర్చులు ఎలా అని మరికొందరు భిన్నమైన అభిప్రాయాలతో పరిస్థితులను భేరీజు వేసుకుంటున్నారు. ఎటొచ్చీ ఎన్నికలంటేనే ఖర్చు.. ఇప్పటికే నెలయింది. మరో రెండు నెలలంటే మాటలా అని అధికార పార్టీ అభ్యర్ధులు మధనపడుతుంటే, పొత్తులకు మాకింకా టైం దొరికింది అని విపక్షాలు సంబరపడుతున్నాయి.

ఏదెలా ఉన్నా రాష్ట్రంలో మరో 60 రోజులు ఎన్నికల ప్రచార జాతర పండగను తలపించనుంది. ఈ రెండు నెలలూ పార్టీలు ప్రజల్లో ఉండక తప్పనిపరిస్థితి నెలకొంది. ఇంకా నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ ప్రకటించకున్నా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైన సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే వచ్చే నెల 3న ఈసీఐ బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంతోపాటు, తాజాగా సీఈవో వికాస్‌రాజ్‌ షెడ్యూల్‌ ప్రకారమే గడువులోగా ఎన్నికలు జరగనున్నాయని చూచాయగా ప్రకటించడంతో వాతావరణం మరింత రంజుగా మారింది. డిసెంబర్‌లో ఎన్నికలు తప్పవనే ప్రచారం నేపథ్యంలో అప్పటివరకు ప్రజాక్షేత్రంలో పార్టీలు, నేతలు, అభ్యర్ధులు నిలవక తప్పని పరిస్థితి నెలకొంది.

అధికార పార్టీ ముందంజలో…

రాష్ట్రంలోని 119 అసెంబ్లిd స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరగనున్నాయనే అంశం ఈసీ ఏర్పాట్లతో స్పష్టమైంది. అయితే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ గత నెలలోనే అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి దూకగా, విపక్షాలు సమయం తీసుకున్నాయి. అవి ఇంకా కొలిక్కి రాలేదు కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం 105 నియోజకవర్గాల్లో ప్రచారం ఉరుకులు పెట్టిస్తోంది. అయితే ఎన్నికల సంఘం ఇప్పటినుంచే ఖర్చులను లెక్కిస్తోంది. వ్యయం రూ. 28లక్షలకే పరిమితం చేయడంతో పార్టీలకు ఈ గడువు ఇబ్బందులు తేనుంది.

ఇప్పటికే రాష్ట్రంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్స్‌, వీడియో సర్వైలెన్స్‌ టీముల ఏర్పాటు దిశగా ఈసీ చర్యలు తీసుకుంది. అభ్యర్ధుల ప్రకటనలో జాప్యంఒ చేస్తున్న అన్ని విపక్షాలకు దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వాలన్న యోచనతో సీఎం కేసీఆర్‌ వ్యూహం పన్నారు. కొంత ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయని భావించినా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు, జమిలీ ప్రస్తావనలతో జాప్యం తలెత్తింది. దీంతో టీఆర్‌ఎస్‌కు డిసెంబర్‌లో ఎన్నికలతో వ్యయం తడిసి మోపెడు కానుంది.

రెండు నెలలకుపైగానే…

రెండు నెలల గడువున్న ఎన్నికలకు ఇప్పటినుంచే ఓటర్లను కాపాడుకోవాల్సిన విచిత్రపరిస్థితి అధికార పార్టీకి ఎదురవుతోంది. తాజాగా గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ తీర్మానాలను వ్యతిరేకిస్తూ అనుసరిస్తున్న వైఖరితో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆగ్రహంగా ఉంది. కేంద్రం తమతో కలిసి రావడంలేదని, ఎలాగు సహకరించదని బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు అర్ధమైంది.

కాంగ్రెస్‌, బీజేపీలకు మరోసారి అవకాశ: ఎందుకివ్వాలని, దేశంలో అన్ని అనర్ధాలకు ఈ రెండు పార్టీలే కారణమని సీఎం కేఉసీఆర్‌ పలు బహిరంగ సభలలో ప్రజలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒకరకంగా కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల కార్యక్రమాలతో తొలి దశ ప్రచారాన్ని ఆయన ప్రజల్లోకి పూర్తిగా తీసికెళ్లగలిగారు.

విపక్షాలు సైతం…

అధికార టీఆర్‌ఎస్‌ విమర్శలకు విపక్షం కాంగ్రెస్‌ కూడా ధీటుగానే సమాధానం ఇస్తోంది. టీఆర్‌ఎస్‌కు తమపాలనగురించి ప్రశ్నిచే నైతికత లేదని టీపీసీసిసి అధ్యక్షుడు రేవంత్‌రెెడ్డి పలు సందర్బాల్లో ప్రకటిస్తూ బీఆర్‌ఎస్‌ను ఇరుకున్న పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ రెండు పార్టీలూ త్వరలో తమ అభ్యర్ధులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఈ దిశలో అనేక వడపోతలు జరిపాయి.

వచ్చే నె 3 తర్వాత మరింత తీవ్రం…

అయితే రాష్ట్రంలో రాజకీయ వేడి వచ్చే నె 3నుంచి తీవ్రతరం కానున్నది. గతంలో ఎన్నికలకు, నోటిఫికేషన్‌కు మధ్య ఎక్కువలో ఎక్కువగా నెల రోజులకు మించి ఉండేది కాదు. దీంతో అభ్యర్ధులకు ఖర్చు విషయంలో కొంత వెసులుబాటు ఉండేది. అయితే ఈసీ బృందం పర్యటన తర్వాత వీలైనంత త్వరగా షెడ్యూల్‌ వస్తే బాగుంటుందని అధికార పార్టీ ఆశిస్తున్నది.

విపక్షాలు మాత్రం ప్రస్తుతానికి హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నాయి. ఇప్పటికే నెలరోజులుగా ప్రచారం చేస్తున్నాం. ఖర్చులు పెడుతున్నాం…మరో 60 రోజులు ప్రజల్లో ఉంటూ ప్రచారం చేయాలంటే తమ అంచనాలు మించుతాయని పలువురు అధికార పార్టీ అభ్యర్ధులు పేర్కొంటున్నారు.

మహిళా ఓటర్లే కీలకం…ఎవరి పక్షమో…

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు వచ్చే శాసనసభా ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళా భాగస్వామ్యమే ఎక్కువగా ఉండటంతోపాటు అనేక పథకాలు వారికి నేరుగా లబ్ది చేకూర్చిన తీరు తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లపై బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకోగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకుగానూ 10 నియోజకవర్గాల్లో మహిలా ఓటర్ల ఆధిపథ్యమే ఉన్నది.

రాష్ట్రంలోని అనేక అసెంబ్లి నియోజకవర్గాల్లో కూడా పురుషులకంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 24 అసెంబ్లిd నియోజకవర్గాలతోపాటు మిగతా జిల్లాల్లో దాదాపు 38 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల హవా పెరిగింది. వరుస క్రమంలో మొదటిదైన ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోనే తొలిగా మహిళా ఓటర్ల ఆధిక్యం ఆరంభమైంది. ఈ నియోకవర్గంలో 107159 పురుష ఓటర్లుండగా, 109396 మహిళా ఓటర్లున్నారు.

బోధ్‌లో 98307 మహిళా ఓటర్లుకాగా 94471 పురుష ఓటర్లే ఉన్నారు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు నియోజకవర్గాలు మహిళాధిపత్యమే కొనసాగించాయి. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో 103090 మహిళా ఓటర్లు, 99432పురుష ఓటర్లతో నిల్వగా, నిర్మల్‌, ముధోల్‌లలో కూడా వీరే అగ్రభాగాన నిల్చారు. దీంతో ఈ జిల్లాలో కూడా పూర్తిగా వారే ముందంజలో నిల్చారు.

నిజామాబాద్‌ జిల్లాలో బాన్సువాడ , ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్భన్‌, రూరల్‌, బాల్కొండ అంతటా మహిళాధిపత్యమే ఉంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌, యల్లారెడ్డి కామారెడ్డి మూడింటికి మూడు నియోజకవర్గాలు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మూడు నియోజకవర్గాలు, కరీంనగర్‌ జిల్లా చొప్పదండి, మానకొండూర్‌, హుజూరాబాద్‌లలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే పెరిగిన జాబితాతో వెల్లడయ్యే తుది ఓటర్ల లిస్టుతో కొన్ని మార్పులు సంతరించుకోనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement