డీజే టిల్లు పార్ట్2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మొదలైనట్లు చిత్ర బృందం ఆసక్తికర వీడియో ద్వారా తెలియజేసి ఆసక్తిని రెట్టింపు చేసింది. తొలి పార్టులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రెండో పార్టులో వేరే హీరోయిన్ ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. హీరోయిన్ విషయమే ఇప్పుడు డీజే టిల్లు చిత్ర బృందానికి సవాల్ గా మారింది. సీక్వెల్లో ముందుగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే ఆమె తప్పుకుంది.
ఆ తర్వాత యువ హీరోయిన్ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఆమె కూడా ఆఖర్ వదులుకోగా ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా ఎంపికైందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మడోన్నా కూడా కాదనడంతో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హిట్-2తో ఆమె ఈ మధ్యే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మీనాక్షి గురించి డీజే టిల్లు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దాంతో, తనైనా చేస్తుందా? లేక హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది.