సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ..జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ గ్లోబర్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు.. . దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరమన్న తీర్మానానికి 52 దేశాల ఎన్నారై ప్రతినిధులతో మద్దతు కూడగట్టిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. తీర్మానం ఈ విజయ దశమని రోజున కార్యరూపం దాల్చుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆస్ట్రియా, టీఆర్ఎస్ చెక్ రిపబ్లిక్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఎన్నారైలు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతో నినదించారన్నారు.మోదీ పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ పతనమైందన్నారు.
కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమని, దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయమన్న మహేశ్.. జాతీయ పార్టీ ఆవిర్భావం దేశ భవిష్యత్ను మార్చబోతుందన్నారు. 20 సంవత్సరాల కిందట సాదాసీదాగా ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ.. ప్రస్తుతం ఇన్ని సంచనాలు సృష్టిస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు. సమైక్య పాలనను బద్దలు కొట్టి.. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన తీరు అనితర సాధ్యమైందన్నారు. రాష్ట్రాన్ని సాధించిన అనంతరం రైతుబీమా, రైతుబంధు, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం తదితర పథకాలతో సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. ‘బీజేపీ ముక్త్ భారత్’ నినాదంతో కేసీఆర్ అడుగుజాడల్లో ముందుకెళ్తామన్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. విదేశాల్లో ఉన్న వారందరికీ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో వివరించి.. మద్దతు కూడగడుతామన్నారు.