Saturday, May 4, 2024

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాకుండా కుట్ర : మంత్రి పువ్వాడ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వెనుక కుట్ర జరుగుతున్నదని, బయ్యారంలో ఎప్పటికీ స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కాకుండా బీజేపీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మంత్రి పుల్వాడ అజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బైలదిల్లా గనులను అదానీ పరం చేస్తున్నదని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాపిటివ్‌ గనులు లేకుండా చేసి మూసివేస్తారని ఆరోపించారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర పన్నారని చెప్పారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ మీడియాతో మాట్లాడారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును విభజన చట్టంలో పొందుపరిచారని గుర్తుచేశారు. స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ముడి ఇనుమును బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలిస్తున్నారని చెప్పారు. అదానీ కోసమే 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంద్రాకు ఐరన్‌ ఓర్‌ పంపిస్తున్నారని విమర్శించారు. బయ్యారంలో ఎప్పటికీ పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మౌలిక వసతుల్లో 50 శాతం ఖర్చుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement