Friday, May 17, 2024

AP | వైసీపీలో బానిసత్వం చేసినవారే ఎమ్మెల్యేలు అవుతారు : ప‌వ‌న్ క‌ళ్యాన్

కృష్ణా జిల్లా పింగళి వెంకయ్య వంటి మహనీయుడు పుట్టిన నేల. రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే మేం బెదిరిపోం. తప్పులు చేస్తే తాట తీస్తాం, వెర్రిమొర్రి వేషాలేస్తే పీక నులిమి రోడ్ల మీద కూర్చోబెడతాం అని వైసీపీపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

దమ్ము ధైర్యం లేకపోతే బతకలేని ఈ సమాజంలో జగన్ ఎంత, జగన్ బతుకెంత? ఏం తప్పు చేశామని జగన్ కు, జగన్ ఎమ్మెల్యేలకు భయపడాలి? రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించలేదా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మన బతుకులు నలిపేస్తాడా? అని మండిప‌డ్డారు. జగన్ ను నమ్మి వైసీపీలో చేరిన‌ మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు ఇద్దరూ ఆ పార్టీనుంచి బయటికి వచ్చేశార‌ని… అలాంటి వాళ్లే వైసీపీని వదిలి వచ్చేశారంటే అందరూ ఆలోచించాలని అన్నారు. వైసీపీలో వ్యక్తులు అవసరం లేదు, వారికి బానిసలు మాత్రమే అవసరం అని పవన్ పేర్కొన్నారు. వారి మోచేతి అంబలి తాగాలి, అలాంటి బానిసత్వం చేసినవారే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అవుతారు అంటూ విమర్శించారు.

మాతృభాష మాధుర్యం అర్ధం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేం ఇంగ్లీషు మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని కోరితే, మేం ఇంగ్లీషు రద్దు చేయమన్నామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులకు జ్ఞానం ఉంటే మేం అన్న మాటల్లో తేడా అర్థమవుతుంది. వైసీపీ నేతలకు తెలుగు అంటే బూతులు తిట్టడం… మాకు తెలుగు అంటే ఆత్మ ఉత్తేజం పెంచడం. ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించాల‌ని.. జనసేన నుంచి పోటీ చేస్తున్న‌ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ ల‌కు ఓటు వేసి గెలిపించాల‌ని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement