Wednesday, May 8, 2024

ప్రకాష్‌రాజ్‌పై కేసు.. చంద్రయాన్‌-3ని ఎద్దేవా చేశారంటూ ఫిర్యాదు

బాగల్‌కోట్‌, కర్నాటక: భారత్‌కు ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 మిషన్‌ను ఎద్దేవా చేస్తున్నట్టుగా సోషల్‌ మీడియాలో ఒక కార్టూన్‌ను పోస్ట్‌ చేసిన సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌పై కర్నాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలోని బానహట్టి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. హిందూ సంఘాలకు చెందిన నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రకాష్‌రాజ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. లుంగీ, చొక్కా ధరించిన ఒక వ్యక్తి ఒక గ్లాసులో టీని పై నుంచి కిందకు వలయాకారంలో తిరగగొడుుతున్న ఒక కార్టూన్‌ను ప్రకాష్‌ రాజ్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో ఆదివారం పోస్ట్‌ చేశారు. ”చంద్రయాన్‌ నుంచి వచ్చిన తొలి చిత్రం” అని పేర్కొంటూ సదరు కార్టూన్‌కు ఒక కామెంట్‌ జోడించారు.

దేశ కీర్తి ప్రతిష్టలతో చంద్రయాన్‌-3 ముడిపడి ఉందని చెబుతూ అప్పటి నుంచి అనేక మంది ప్రకాష్‌ రాజ్‌పై విమర్శల వర్షం కురిపించసాగారు. విమర్శలకు స్పందిస్తున్నట్టుగా ”ద్వేషం ఎప్పుడూ ద్వేషాన్నే చూస్తుంది. ఆర్మ్‌స్ట్రాంగ్‌ కాలంలో మన కేరళ చాయ్‌వాలాకు సంబంధించిన ఒక జోక్‌ను నేను ప్రస్తావించాను. ఏ చాయ్‌వాలా ఈ ట్రోల్స్‌ చూస్తారు? దాంట్లో జోక్‌ మీకు అర్థం కాకపోతే ఆ జోక్‌ మీపైనే అనుకోండి.. ఎదగండి” అని ప్రకాష్‌ రాజ్‌ పోస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement