Sunday, May 12, 2024

జార్ఖండ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం.. 4 వేల కోళ్లు, బాతులను చంపనున్న అధికారులు

జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రి ఫామ్‌లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిచెందడంతో కోళ్లు, బాతులతో సహా దాదాపు 4 వేల పక్షులను చంపేయాలని పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ శనివారం అర్థరాత్రి ప్రారంభమైంది. ప్రభుత్వ ఫౌల్ట్రి ఫామ్‌లో ఈ నెల 2 నుంచి కోళ్లు చనిపోతున్నాయి. దీనికి గల కారణాలను పరిశీలించగా బర్డ్‌ఫ్లూ గా పేర్కొనే ఏవియన్‌ ఇన్‌ప్లూఎంజా వైరస్‌ రకానికి చెందిన హెచ్‌5ఎన్‌1 గా గుర్తించామని, దీనికారణంగా పక్షులు మరణిస్తున్నాయని నిర్ధారించామని అధికారులు వెల్లడించారు. ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్‌నాథ్‌ కోళ్లలో ఈ వైరస్‌ను గుర్తించామని, దీనికారణంగా లో హించల్‌లోని ఫామ్‌లో ఉన్న 800 కడక్‌ నాథ్‌ కోళ్లు చనిపోయాయని, మరో 103 కోళ్లను చంపాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో లోహంచల్‌ ఫామ్‌కు కిలోమీటర్‌ పరిధిలో ఉన్న 3,856 కోళ్లు, బాతులను చంపేయాలని నిర్ణయించామని రాంచీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ హెల్త్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిపిన్‌ బిహారీ మహ్తా చెప్పారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, పౌల్ట్రి ఫామ్‌ పరిధిలో 1 కి.మీ వరకు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించామని, 10 కి.మీ ప్రాంతాన్ని నిఘా జోన్‌గా ప్రకటించామన్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే బాతులు, కోళ్ల విక్రయాలను నిలిపివేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ హెచ్చరికలు జారీ చేశామని, కోళ్ల ఫారాలపై నిఘా పెంచామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement