Monday, April 29, 2024

Delhi | సిసోడియా అరెస్ట్.. అధికారుల వాంగ్మూలమే ఆధారం! మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. ఆదివారం సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు, అనంతరం అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ అరెస్టును ముందు నుంచీ ఊహించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఉదయం నుంచి ఆందోళన తీవ్రతరం చేసింది. విచారణకు హాజరయ్యే ముందు మనీశ్ సిసోడియా, మహాత్మ గాంధీ సమాధి రాజ్‌ఘాట్ సందర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. సుమారు 50 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే దాదాపు రోజంతా సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రాత్రి గం. 7.15 సమయంలో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సీబీఐ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 17న మద్యం కుంభకోణం వ్యవహారంపై మనీశ్ సిసోడియాతో పాటు మరొక 14 మందిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు వెల్లడించింది. నవంబర్ 25న ఆమ్ ఆద్మీ పార్టీ నేత విజయ్ నాయర్, మరో ఆరుగురిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు పేర్కొంది.

- Advertisement -

తాజాగా ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసు పంపించామని, అయితే సిసోడియా విజ్ఞప్తి మేరకు ఆ తేదీని ఫిబ్రవరి 26 (ఆదివారం)కు మార్చామని తెలిపింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, ఇతర సాక్ష్యాల అనుగుణంగా అక్టోబర్ 17న మొదటిసారిగా సిసోడియాను ప్రశ్నించామని, అయితే అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారని సీబీఐ పేర్కొంది. ఆధారాలను ఎదురుగా పెట్టి ప్రశ్నించినప్పటికీ సిసోడియా విచారణకు సహకరించకపోగా సమాధానాలు దాటవేయడంతో అరెస్టు చేసినట్టు వివరించింది.

ఇది చీకటి రోజు: ఆప్

సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. అరెస్టును ప్రజాస్వామ్యానికే ఒక చీకటి రోజుగా అభివర్ణించింది. అరెస్టు చేసిన వెంటనే తొలుత ఆ పార్జీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అరెస్టును ఒక నియంత్రృత్వపు చర్యగా పేర్కొన్నారు. దేశంలోనే ఉత్తమమైన విద్యాశాఖ మంత్రిని, మంచి వ్యక్తిని అరెస్టు చేశారని ఆయనన్నారు. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించరు అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు నియంత్రృత్వం కచ్చితంగా అంతమవుతుందని ట్వీట్ చేశారు.

ఆ తర్వాత కాసేపటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. మనీశ్ సిసోడియా అమాయకుడని, ఆయన్ను అరెస్టు చేయడం నీచ రాజకీయమని అన్నారు. మనీశ్ అరెస్టు పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని ట్వీట్ చేశారు. అరెస్టు సహా జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు చూస్తున్నారని, అన్నీ అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ చర్యలపై ప్రజలు స్పందిస్తారని అన్నారు. ఈ అరెస్టు తమ ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని, తమ పోరాటం మరింత బలపడుతుందని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు

అరెస్టును రాజకీయం చేయడం మాని ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్పండి: బీజేపీ

మనీశ్ సిసోడియా అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. అరెస్టుపై స్పందిస్తూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసని, 2 శాతం ఉన్న డీలర్ కమిషన్‌ను 12 శాతం ఎందుకు పెంచారో చెప్పాలని సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఈ పెంచిన కమిషన్ ద్వారా పోగేసిన సొమ్ము దొడ్డిదారిన తిరిగి పార్టీకి చేరిందని అన్నారు. ఢిల్లీ జనాన్ని మత్తులో ముంచి సంపాదించిన అవినీతి సొమ్ముతో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేస్తోందని నిందించారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి రాకముందు గల్లీ పార్లమెంట్ నిర్వహించి మహిళల అభిప్రాయాలు తీసుకున్నారని, గల్లీల్లో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని మహిళలు కోరగా, అధికారంలోకి వస్తే వాటిని మూసేస్తానని చెప్పారని గుర్తుచేశారు.

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేత కాదు కదా, గల్లీ గల్లీకి మద్యం దుకాణాలు తెరిచారని మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఒక బ్యూరోక్రాట్ అని, ఎక్సైజ్ పాలసీ మీద ఆయన..  లేదా, ఆ పార్టీ నేతలు ఎవరైనా మీడియా సమావేశం పెట్టారా అని ప్రశ్నించారు. ఆ పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఎంత ప్రయోజనం కల్గిందో చెప్పగలరా అని నిలదీశారు. ఇందులో జరిగిన అవకతవకలను లెఫ్టినెంట్ గవర్నర్ లేవనెత్తగానే డీలర్ కమిషన్‌ను 12 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారని, ఆ తర్వాత కొన్నాళ్లకే మద్యం పాలసీని రద్దు చేశారని గుర్తుచేశారు. పాలసీలో ఎలాంటి తప్పు లేకపోతే ఈ నిర్ణయాలు ఎందుకు వెనక్కి తీసుకున్నారని సంబిత్ పాత్రా ప్రశ్నించారు.

పాలసీ రూపొందించే సమయంలోనే ఆప్ నేతలు లిక్కర్ సిండికేట్ వ్యాపారులతో మంతనాలు సాగించారని, వారికి అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, సిండికేట్‌కు ఇబ్బందిగా ఉండే నిబంధనలను తొలగించారని ఆరోపించారు. చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ మద్యం తయారీదారుడు, హోల్‌సేలర్, రిటైలర్ ఒక్కరే ఉన్నా సరే టెండర్లు కట్టబెట్టారని అన్నారు. అలాగే బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు కూడా లైసెన్సులు మంజూరు చేశారని అన్నారు. ఇంత స్పష్టంగా అక్రమాలు కళ్లకు కనిపిస్తున్నాయని, ఆప్ నేతలకు మాత్రం కనిపించడం లేదని అన్నారు.

దర్యాప్తు సంస్థలు భావోద్వేగాల ఆధారంగా పనిచేయవని, సాంకేతికాంశాలు, ఆధారాల అనుగుణంగానే దర్యాప్తు జరుపుతాయని తెలిపారు. లేదంటే న్యాయస్థానాల్లో అవి నిలబడవని అన్నారు. దర్యాప్తు సంస్థలకు ఉద్దేశాలను ఆపాదిస్తూ రాజకీయాలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఒక విద్యాశాఖ మంత్రి మద్యం కుంభకోణంలో అరెస్టు కావడాన్ని మించిన సిగ్గుచేటు మరొకటి ఉండదని, దేశంలో మరెక్కడా ఇలాంటి ఘటన జరిగలేదని సంబిత్ పాత్రా అన్నారు. ఢిల్లీ మహిళలు కోరింది ఒకటైతే, కేజ్రీవాల్ మరొకటి చేశారని, అందుకే ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఊచలు లెక్కించాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

దర్యాప్తు సంస్థలు, రాజకీయ పార్టీలు వేర్వేరు అంశాలని, రెండింటినీ ముడిపెట్టడం తగదని అన్నారు. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ విషయంలో కూడా ఆప్ నేతలు ఇలాగే ఆరోపణలు చేశారని, కానీ కోర్టు ఇప్పటి వరకు బెయిలే ఇవ్వలేదని గుర్తుచేశారు. కేసులో మెరిట్ ప్రకారమే బెయిల్ ఇవ్వడం లేదని న్యాయస్థానాలు చెబుతున్నాయని, మనీశ్ సిసోడియా విషయంలోనూ ఇదే జరగుతుందని పాత్రా అన్నారు. బీజేపీపై ఆరోపణలు చేసే కేజ్రీవాల్, ముందు మద్యం పాలసీకి సంబంధించి బీజేపీ లేవనెత్తిన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement