Tuesday, May 7, 2024

దర్యాప్తు సంస్థలకు భరోసా!

అవినీతిపరులు ఎంత పెద్దవారైనా, ఎంత పెద్ద పదవుల్లో ఉన్నవారైనా వారిపై చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం భయపడవద్దనీ, ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దర్యాప్తు సంస్థల అధికారులకు పిలుపు ఇచ్చారు. విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ సందర్భంగా ఆయన ఢిల్లిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ దర్యాప్తు సంస్థల అధికారుల పనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడం కోసం కొన్ని శక్తులు దర్యాప్తు సంస్థలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న సంగతిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ పిలుపు ఇచ్చి ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో సీబీఐ, ఆర్థిక శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) విభాగం దాడులపై బీజేపీయేతర పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. పార్టీల వచ్చే ఎన్నికల్లో ఈ విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పాటికే సమావేశాలు నిర్వహించి మోడీపై దాడికి ఇదే సరైన అస్త్రమని నిర్ణయించాయి. ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తెచ్చే అంశం ఇంతకు మించి వేరే లేదన్న నిర్ధారణకు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ బలహీనపడిన ప్రస్తుత పరిస్థితులలో ప్రాంతీయ పార్టీలతో ఘర్షణ పడితే నష్టమే తప్ప లాభం లేదని ప్రధాని గ్రహించి ఉంటారు.

అంతేకా కుండా, ప్రాంతీయ పార్టీల కూటమి కనుక బలపడితే బీజేపీకి ఎదురు సవాల్‌ తప్పదని కూడా మోడీ భావించి ఉంటారు. తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో గతంలో మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్‌ కాకుండా బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఆమ్‌ ఆద్మి (ఆప్‌)పార్టీ ని చూస్తున్నారు. ఆప్‌ క్షేత్ర స్థాయిలో బాగా విస్తరించింది. కాంగ్రెస్‌ ఇప్పటికీ గ్రూపు రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ గుజరాత్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తమ పార్టీ కార్యకర్తలకు కానీ, అధికారులకు ఆదేశాలూ, పిలుపు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో కన్నా మోడీ హయాంలో సీబీఐ, ఈడీ దాడులు ఎక్కువ య్యాయనీ, అధికారులు మారుమూల ప్రాంతాల్లో కూడా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సీబీఐ పెద్దనగరాల్లో కార్పొరేట్‌, పారిశ్రామిక దిగ్గజాల నివాసాలు, కార్యాల యాలపై మాత్రమే దాడులు, సోదాలు నిర్వహించేది. ఇప్పుడు చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు, రాష్ట్ర స్థాయి నాయకుల ఇళ్ళల్లో ఈ మాదిరి దాడులు జరుపుతోంది. దీనిపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. గతంలో అవినీతి ఆరోపణలకు గురి అయిన వారు రాజకీయాల్లో చురుకై న పాత్ర వహించేవారు. ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చిన వారు కూడా రాజకీయాల్లో విరివిగా పాల్గొంటున్నారు. జైలుకి వెళ్ళి వచ్చిన వారిని కీర్తించే ధోరణి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిందనీ, ఇది మంచి పరిణామం కాదని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి, పర్యావరణ సమ తూక స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవల్సి ఉందని ఆయన అన్నారు.

అభివృద్ధి పేరిట అడవుల విధ్వంసాన్ని అరికట్టాల్సి ఉంది. ఖనిజాలు నిక్షిప్తమై ఉన్న గనులను, ఇతర సహజవనరులను సరళీకృత ఆర్థికవిధానాలు అమలులోకి వచ్చిన తర్వాత లీజుకి ఇచ్చే ధోరణి పెరిగిపో యింది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇది కనిపిం చేది, ఇప్పుడు కేంద్రం ఇచ్చే లీజులలో కూడా అవినీతి యధేచ్ఛగా సాగుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాం లో చోటు చేసుకున్న బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను పురస్కరించుకుని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సీబీఐని పంజరంలోని చిలకగా అభివర్ణిం చింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అవినీతి ఆరోపణలు సీబీఐ అధికారులపై వస్తున్నాయి. అలాగే, ఈడీ అధికారు లపైన కూడా వస్తున్నాయి. గతంలో ఈడీ పదంఎక్కువ వినిపించేది కాదు. ఇప్పుడు ఒక రాష్ట్రమని కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈడీ అధికారులపై దాడులు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈడీ అధికారులు, సీబీఐ అధి కారులు భయపడవద్దని ప్రధాని ధైర్యాన్ని చెప్పి ఉంటా రు. అవినీతి ఆరోపణలు గ తంలో కొన్ని శాఖలలోనే వచ్చే వి. ఇప్పుడు అన్ని శాఖల్లో అవినీతి మేటలు వేస్తోంది. పురపాలక, నగరపాలక సంస్థల కార్యాలయాల్లోపైసలి వ్వనిదే పనులు జరగవన్న నానుడి స్థిరపడి పోయింది. అవినీతి కేసులు సకాలంలో పరిష్కారం కాకపోవడం వల్ల ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యం లంచం ఇచ్చేవారిలో, పుచ్చుకునేవారిలో పెరిగిపోతోంది. అవినీతి కేసుల రోజు వారీ విచారణ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కేసుల విచారణ వేగంగా జరుగుతోంది. ఫిర్యాదుల కోసం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఒక పోర్టల్‌ని నిర్వహి స్తోంది. దీనిని ప్రధానమంత్రి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement