Saturday, March 16, 2024

నేటి సంపాద‌కీయం – విమ‌ర్శ‌ల‌కిది స‌మ‌యం కాదు

క‌రోనా మహమ్మారి కోెరల్లో కోట్లాది మంది చిక్కుకున్న సమయంలో వారందరికీ ఉత్తమమైన చికిత్స అందేట్లు చూడటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అహరహం కృషిచేస్తున్నారు.ఎప్పటికప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్‌ చేసి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.ముఖ్యమంత్రుల అభ్యర్ధనల మేరకు ఆయారాష్ట్రాలకు తగినన్నివ్యాక్సిన్‌ లు,ఆక్సిజన్‌ సిలిండర్లు పంపేందుకు వెనువెంటనే ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయినప్పటికీ,పలు రాష్ట్రాలముఖ్యమంత్రులు తమకు వ్యాక్సిన్‌,ఆక్సిజన్‌ అందడం లేదన్న ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.దీనిని మన వ్యవస్థలో ఉన్న లోపంగానే చూడాలి తప్ప రాజకీయంగా చూడరాదన్న అభిప్రాయం సరైనదే.ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకుతావు లేదు.ఐదురాష్ట్రాల ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వాలు కొలువు తీరిన తర్వాత ఇప్పుడు ప్రతిఒక్కరూ ఆలోచించాల్సింది ఉమ్మడి సమస్య సమస్య అయిన కరోనా గురించే.మన దేశంలోనే కాదు.అన్ని దేశాల్లో కరోనా రెండవదశ తీవ్రంగా ఉంది.వాషింగ్టన్‌ వేదికగా పని చేస్తున్న ప్రపంచ ఆరోగ్య పరిశోధనా సంస్థ 59 దేశాల్లో జరిపిన అధ్యయనంలో కోవిడ్‌ మరణాల రేటు అన్ని దేశాల్లో ఎక్కువగా ఉన్నా,తగ్గించిచూపుతున్నారని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ తీసుకుంటున్న శ్రద్దాసక్తులను ప్రపంచ ఆరోగ్య పరిశోధనా సంస్థ ప్రశంసించింది. ఎక్కడ ఆక్సిజన్‌ దొరికితే అక్కడి నుంచి దానిని దిగుమతి చేసుకునేందుకుప్రధాని చర్యలుతీసుకుంటున్నారు.ఈ విషయంలో ప్రధాని చొరవను పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ప్రశంసించారు.ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధానిని మనమే విమర్శించడం కించపర్చుకోవడమే అవుతుంది.కోవిడ్‌ రెండవదశ ప్రారంభం నాటికీ,ఇప్పటికీ ఆక్సిజన్‌ సరఫరాలో చాలా మెరుగుదల కనిపించింది.ఢిల్లిdకి అందించిన మాదిరిగానే కర్నాటకకు కూడా ఆక్సిజన్‌ అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తగినన్నిఆక్సిజన్‌ నిల్వలను ముందుగా భద్రపర్చుకోకపోవడం ప్రణాళికా లోపమని ఇంతకుముందు విమర్శించిన వారే ఇప్పుడు ఆక్సిజన్‌ సరఫరా పట్ల సంతృప్తిని ప్రదర్శిస్తున్నారు.అయితే,ఒక చోటనుంచి మరో చోటకి ఆక్సిజన్‌ తరలించే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సినఅవసరం ఉంది. పారిశ్రామిక సంస్థల సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాదిరిగానే రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్‌ పేపర్‌ మిల్స్‌ రోజుకు నాలుగు టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు అంగీకారం తెలిపింది.నాలుగురోజుల్లో సరఫరా మొదలు కావచ్చు.అలాగే,తమ ప్రాంతాల్లోని పరిశ్రమలనుంచి ఆక్సిజన్‌ సేకరించడానికి ముఖ్యమంత్రులు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేయాలి.జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ప్రధాని మోడీపై చేసిన విమర్శలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆక్షేపణ తెలిపారు.వీరి లో బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.కోవిడ్‌ -19 రెండవ దశ మొదటి దశ కన్నా ప్రళయభీకరంగా ఉన్న కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదు.అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు రాజకీయనాయకులు,మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు ప్రయత్నించాలే తప్ప, ప్రజల చిత్తస్థయిర్యం దెబ్బతినేలా చేయకూడదు. కోవిడ్‌-19 రెండవదశలో కొత్తరకం వేరియంట్లు వస్తున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్న విషయాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాలి.ఇలాంటి వేరియంట్లవిషయంలో పుకార్లు,లేదా నోటి మాట ద్వారావిన్న విషయాలను ప్రచారం చేయడం వల్ల సాటివారిని భయపెట్టినట్టు అవుతుంది.కనుక,కొత్త రకం వేరియంట్ల గురించి ప్రమాదకరమైన పరిస్థితుల గురించి శాస్త్రజ్ఞులు ప్రకటించిన అంశాలనే ప్రామాణికంగా తీసుకోవాలి.ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా ప్రజలను మరింత ఆందోళనకు గురి చేసే విధంగా ప్రకటనలు చేయడం ఈ తరుణంలో అసలుమంచిదికాదు.ఇప్పుడు జనంలో కావల్సింది జాతీయ స్ఫూర్తి.కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌ ఏకతాటిపై నిలిచి పోరాడాల్సిన సమయమిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement