Wednesday, May 8, 2024

తిరుప్పావై : పాశురము-11

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

కత్తు క్కుఱవై క్కణంగళ్‌ పల కరన్దు
శెత్తార్‌ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్‌
కుత్త మొన్ఱిల్లాద కొవలర్‌దమ్‌ పొఱ్కొడియే
పుత్తర వల్‌గుల్‌ పునమయిలే పోదరాయ్‌
శుత్తత్తు తోళిమారెల్లారుమ్‌ వన్దు; నిన్‌
ముత్తమ్‌ పుగున్ద ముగిల్‌ వణ్ణన్‌ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
ఎత్తు క్కుఱఙ్గుమ్‌ పొరుళే లోరెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
” లేగదూడలు గల చాలా ఆవుల మందలకు పాలు పిండి, శత్రువుల బలము నశించునటుల ఎదిరించి యుద్ధము చేయు గోపాలవంశములో దోషములు లేని దానవైన బంగారు తీగా! పుట్టలోన సర్పము వంటి నితంబము కలదానా! అడవిలో నెమలివంటి కేశపాశము కలదానా! లేచిరమ్ము! చుట్టాలు చెలులు అందరూ వచ్చిరి. నీ ముంగిట నిలిచిరి. నీలమేఘశ్యాముని కీర్తించుటకే వచ్చిరి. ఉలుకవు. పలుకవు. సంపన్నురాలా నీ నిద్ర కర్ధమేమి?”
ఆవులనగా వేదములు. దూడలనగా వేదాంగములు. పాలనగా సారము. పిండుట అనగా అందించుట. ఇది ఆచార్యుల పని. శత్రువులనగా కామక్రోధాద్యరిషడ్వర్గము. కామాదులను ఆచార్యుడే తొలగించవలయును.
పుట్టలోని పాము అనగా మూలాధారము నందలి కుండలిని శక్తి. నెమలి వంటి కేశపాశమనగా సహస్రారము.
చుట్టాలు, చెలులు భగవద్భక్తులు.
భక్తుల ఇంటి ముందు నిలుచుటే పరమ ప్రయోజనము.
నిద్ర అనగా భగవద్గుణాను సంధానము.
ఈ పాశురమును పూదత్తాళ్వారులను మేల్కొలుపుచున్నారు.
‘కుత్తమొన్నిల్లాద’ అనునది వీరికి సరిపోవును. ఇతరళ్వారులందరు గర్భవాసము గావించి జన్మించిరి. ముదలాళ్వార్లు మాత్రమే అయోనిజులు. కావున ఏ మాత్రము దోషము లేనివారు.
వీరు సాధించిన రెండవ తిరు వందాదిలో ‘అంకోల్‌’ ‘తేడియోడుం’ ‘కోళున్దదే పోన్నమాల్‌ తేడియోడుం మనం’ అని పందిరి స్తంభమును వెతుకుకొనుచు వెళ్ళుతీగగా తనను తాను చెప్పుకొనివారు. కావున వీరు ‘కోవలర్‌దం పొర్కొడియే’ కదా.
ఇక ‘శుత్తత్తు తోళిమారు’ అని వీరికి పొయ్‌గ పేయాళ్వార్లు చుట్టు ఉండు సఖియలు. ఇతరాళ్వార్లు చెలులు మాత్రమే అని కూడా ఈ విశేషణము వీరికి సరిపోవుచున్నది.
ఇక గురు పరంపరా వాక్యములలో
‘ శ్రీమద్యామున మునయే నమ:’ అనువాక్యము ఇచట అనుసంధానము చేసికొనవలయును.
ఇచట ‘కోవలర్‌’ అనగా గోపాలురు. గోపాలురకు శ్రీకృష్ణడే భగవానుడు. ఇతర దైవము లేదు. అనగా భగవదనన్యార్హ శేషభూతులు. అనన్య భక్తి కలవారు. లోకీ వతీర్ణ ప రమార్థ సమగ్రభక్తి యోగాయ నాధమునయే’ అని సాధించినట్లు నాధ మునుల వంశమున అవతరించిన మహనుభావుల శ్రీమద్యామున మునులు. కావున వీరు ‘కోవలర్‌ దం పొర్కొడియే’ అగుదురు.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement