Saturday, April 27, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి. ఈరోజు శ్రీకృష్ణావతార వైభవం విశేషాలపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
శ్రీకృష్ణావతారం
‘కృష్ణం ధర్మం సనాతనం’ అని పురాణ వాక్యం. కృష్ణ: అంటే అపరమిత ఆనంద స్వరూపుడు. ”పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనగా సాధు జన రక్షణ, దుష్ట జన శిక్షణ, ధర్మ సంస్థాపనానికై తాను మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని స్వయంగా ప్రకటించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు.
రామావతారంలో రాజుగా ఆర్తులను, దీనులను, భక్తులను ఆదుకున్నా అందరికీ అందుబాటులో లేని కారణంగా కృష్ణుడు క్షత్రియ వంశంలో పుట్టి కూడా రేప ల్లెలోని గోపాలకులతో, గోపికలతో, గోవులతో కలసి మెలసి తిరిగాడు. పాపాలకు దూరంగా ఉన్న వారితోనే, వారిలోనే ఉంటానని చాటాడు. బాలునిగా ఉండి రేప ల్లెలో ధర్మానికి హాని కలిగించే కంసుడు పంపిన రాక్షసులను వధించాడు. చివరికి కంసుని కూడా వధిం చగా ఆ వైరముతో తనపై కక్ష కట్టి దాడి చేసిన జరాసంధుని సైన్యాన్ని పద్దెనిమిది సార్లు హతమార్చాడు. చక్రవర్తి అయిన జరాసంధుడు ఎపుడు యుద్ధానికి వచ్చినా 23 అక్షౌహిణిల సైన్యాన్ని తీసుకొని వచ్చేవాడు. అక్షౌహిణి(10 వేల రధాలు, ఇరవై వేల ఏనుగులు, ఇరవై వేల గుర్రాలు, 40 వేల సైన్యం) ఈ విధంగా 18 సార్లు ఓడించి అనగా 414 అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణ బలరాములు ఇద్దరు మాత్రమే వధించారు. 18 అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణుడువెనకుండగా వధించిన అర్జునుడు, భీముడు మహా వీరులుగా, ధనుర్దాలుగా కీర్తించబ డితే 414 అక్షౌహిణిలను వధించిన కృష్ణుణుడు ధర్మ నిర్వహణ కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం.
కృష్ణావతారంలో ఆశ్రిత వాత్సల్యం, ఆశ్రిత పక్షపాతం, భక్తజన సౌలభ్యం ప్రస్ఫుటంగా కనపడతాయి. పాండవులకు దూత, సారధి అయ్యి అనుక్షణం వారికి కంటికి రెప్పలాగా ఉన్నాడు. ఒక సారధిగా అర్జునని గుఱ్ఱాల ఆలనాపాలనా చూసి, రధానికి ఉన్న దుమ్ము, దూళి తొలగించినట్లే మీ శరీరం, మనస్సులలోని మలినాలను తొలగిం చి గమ్యానికి చేర్చే రథసారధిని నేను అని పాండవులకు చాటినవాడు కృష్ణుడు. ధుర్యోధనుడు విందుకు పిలిస్తే కాదని విదురుని ఇంట్లో భోజనం చేసి ఆశ్రిత పక్షపాతాన్ని చాటిన ఆశ్రిత వత్సలుడు, ధర్మ వత్సలుడు శ్రీకృష్ణుడు. తప్పు చేసిన దేవతలను ఓడించి భక్తులైన గోపాలురును, గోవులను, గోపికలను అక్కున చేర్చుకున్న ధర్మ పక్షపాతి శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణం ధర్మం సనాతనం.
శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement