Thursday, May 2, 2024

దివ్యజ్ఞాన సాధన!

ప్రయత్నాద్‌ యతమానస్థు యోగీ సంశుద్ధకిల్భిష:
అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం
(భగవద్గీత 6వ అధ్యాయం, 45వ శ్లోకం)

అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మన:పూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై ఈ జన్మలోనే పరిపూర్ణత పొందుతారు.
ధ్యాన యోగము అనే ఆరవ అధ్యాయంలో భగవానుడు సాధకుడు ఏవిధమైన సాధనామార్గంలో పయనిస్తే తనను సులభంగా తెలుసుకొని తద్వారా తనను చేరుకోవచ్చు నో వివరించాడు. ఈ సృష్టిలో వున్న సమస్త శక్తులు, తన నుండే ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసల వలె తన యందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము. మళ్ళీ ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది. ఆయన భౌతిక ప్రాకృతిక శక్తి, మాయ బలీయమైనది. దానిని అధిగమించటం చాలా కష్టము, కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు ఆయన కృపకు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తద్వారా జీవితంలో స్వశక్తితో పొందలేనటువంటి బ్రహ్మానంద స్థితి, శాశ్వత ఆనందాన్ని పొందడం సులభమవుతుంది.
మనం నిత్యం భక్తితో నిమగ్నమవ్వటానికి, భగవంతుడే అత్యంత యోగ్యుడు. ఎం దుకంటే సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమత్వం వంటి దివ్య గుణములను కలిగి, తనే పరమ సత్యమని…. అంతిమ లక్ష్యమని, శ్రీ కృష్ణుడు సాధకులకు ప్రబోధిస్తున్నాడు. ఆయనను మనం పవిత్రమైన మనస్సుతో, చిత్తశుద్ధితో, శరణాగత భావంతో ఆశ్రయిస్తే, ఆయనే తన గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఆయనను తెలుసుకున్న తరువాత మన కు కూడా ఆత్మ జ్ఞానము- కర్మ- క్షేత్రము గురించి దివ్య జ్ఞానం అవగతమవుతుంది. ఇందు కు సరైన సాధనా మార్గం ధ్యానమేనని భగవానుడు సాధకులకు మార్గనిర్దేశనం చేస్తున్నా డు. ఎలాగైతే గాలి వీచనిచోట దీపం నిశ్చలంగా ఉంటుందో, అదేవిధంగా సాధకుడు మన స్సుని ధ్యానం యందు నిలకడతో ఉంచాలి. నియంత్రణ చేయటానికి మనస్సు నిజానికి చాలా క్లిష్టమైనది, కానీ, అభ్యాసము, వైరాగ్యములతో దీనిని నియంత్రించవచ్చు. కాబట్టి మనస్సు ఎక్కడికి పోయినా దానిని తిరిగి తెచ్చి, భగవంతుని వైపే విడువకుండ కేంద్రీకరిం చాలి. అప్పుడు మనస్సు పరిశుద్ధమై భగవంతుని వైపు అప్రయత్నంగా తిరుగుతుంది. అనేక జన్మలలో పుణ్యకర్మలను చేసి అనేక పాపాల, మానవ జీవితాన్ని చిద్రం చేస్తున్న ద్వందాల నుండి పైన పేర్కొన్న సాధన ద్వారా విముక్తులమైనప్పుడు సాధకుడు అనునిత్యం భగవం తుని దయాపూరిత ప్రేమ, కరుణ, కృపలకు పాత్రుడు అవుతాడు. అందుకోసం సాధకులు భగవంతుని కృపను పొందదమే తమ లక్ష్యంగా నిర్దేశించుకొని తమ సాధనను తక్షణం ఆరంభించడం ఎంతో అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement