Wednesday, May 15, 2024

UPI | విస్తరిస్తున్న యూపిఐ సేవలు.. ఇక నుంచి శ్రీలంక, మారిషస్‌లోనూ చెల్లింపులు !

భారతదేశం వెలుపల కూడా UPI బలపడుతోంది. నగదు లావాదేవీలు మాత్రమే కాదు, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్‌లోనూ భారత్‌ నానాటికీ పురోగతి సాధిస్తోంది. తాజాగా.. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, మారిషస్‌లోనూ UPI సర్వీస్‌ ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సమక్షంలో.. శ్రీలంక, మారిషస్‌లో ఈ రోజు (సోమవారం) యూపీఐ సేవలను ప్రారంభించారు.

- Advertisement -

దీంతో పాటు, శ్రీలంక, మారిషస్ రెండింటిలోనూ రూపే కార్డ్ ‍‌సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక నుంచి శ్రీలంక, మారిషస్ దేశాలలో ట్రిప్ లకు వెళితే ఎలాంటి ఇబ్బంది లేకుండా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. ఇక ఈ నెలలో, ప్రధాన యూరోపియన్ దేశం ఫ్రాన్స్‌లో UPI సర్వీస్‌ను లాంచ్‌ చేశారు. పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ దగ్గర మీరు ఏదైనా షాపింగ్‌ చేస్తే, ఇప్పుడు UPI ద్వారా చెల్లింపు చేయొచ్చు.

కొంత కాలం ముందు, సింగపూర్‌లోనూ UPI అందుబాటులోకి వచ్చింది. సింగపూర్‌కు చెందిన ఇన్‌స్టాంట్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్ ‘పేనౌ’తో (PayNow) ఇండియన్‌ UPI లింక్ అయింది. ఈ లింకేజీ వల్ల.. సింగపూర్‌ నుంచి భారతదేశానికి. భారతదేశం నుంచి సింగపూర్‌నకు రియల్‌ టైమ్‌లో నగదు బదిలీ సాధ్యమైంది. అంతేకాదు.. UAE, నేపాల్, భూటాన్ సహా భారతదేశం వెలుపల చాలా దేశాల్లో కూడా UPI సేవలు అందుబాటులో ఉన్నాయి.

మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌ కాంగ్, ఒమన్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బ్రిటన్‌లో UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశాలలో అంతర్జాతీయ నంబర్‌ల ద్వారా, భారతీయ ప్రజలు NRE & NRO అకౌంట్ల నుంచి UPIని ఉపయోగించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement