Tuesday, July 23, 2024

Protest – సన్నాలకే బోనస్ – కాంగ్రెస్‌ నిర్ణయానికి నిరసనగా రేపు ఆందోళనలు – పిలుపు ఇచ్చిన కెసిఆర్

కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సీఎం ప్రస్తుతం సన్నవడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడమేనని.. దగా చేయడమేనని మండిపడ్డారు.

హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ‘“రాష్ట్రంలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి వచించింది. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు.

రైతుబంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తున్నది. అందు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది’ కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాలని.. రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధినేత కేసీఆర్ పునరుద్ఘటించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement