Saturday, April 27, 2024

ఏపీ మంత్రి అప్ప‌ల‌రాజును అడ్డుకున్న మ‌హిళ‌లు

ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల రాజుకు నిర‌స‌న సెగ త‌గిలింది. పట్టాల విషయమై మహిళలు మంత్రిని అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఓ ప‌క్క కొత్త జిల్లాల ఏర్పాటు నేప‌థ్యంలో వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫుల్ జోష్‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండ‌గా.. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు మాత్రం ఊహించని షాక్ త‌గిలింది. ప‌లాస మండ‌లం కంబిరిగాం గ్రామానికి చెందిన రైతులు, మ‌హిళ‌లు మంత్రిని అడ్డుకున్నారు. అంతేకాకుండా ఓట్లేసి గెలిపించిన మాకే అన్యాయం చేస్తారా ? అంటూ ఓ మ‌హిళ మంత్రి కారుకు అడ్డంగా నిలుచుని ప్ర‌శ్నించ‌డంతో మంత్రి షాక్‌కు గుర‌య్యారు. కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న అనంత‌రం ప‌లాస‌కు వెళుతున్న సంద‌ర్భంగా కంబిరిగాం స‌మీపంలో మంత్రి అప్ప‌ల‌రాజు కాన్వాయ్‌ను రైతులు, మ‌హిళ‌లు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టాలిప్పిస్తాన‌ని చెప్పిన మీరు, అందుకోసం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని రైతులు ప్ర‌శ్నించారు. తొలుత షాక్‌కు గురైన మంత్రి.. ఆ త‌ర్వాత తేరుకుని రైతుల‌కు స‌ర్దిచెప్పేందుకు య‌త్నించినా రైతులు వెన‌క్కు త‌గ్గలేదు. అయితే పోలీసులు రైతుల‌కు న‌చ్చ‌జెప్పి మంత్రిని అక్క‌డి నుంచి పంపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement