Friday, April 26, 2024

ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోండి: NHRCకి వర్ల రామయ్య లేఖ

సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  NHRCకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఫిర్యాదు చేసేందుకు చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన‌ వేణుగోపాల్ అనే వ్య‌క్తిపై ఎస్ఐ దాడి చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయ‌న పంపారు. హిందూపురం అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గంలోని సజీవరాయనపాలేనికి చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా ఏళ్లుగా వికలాంగుల పింఛను పొందుతోంద‌ని చెప్పారు. అయితే, ఆమె తమ పార్టీకి అనుకూలంగా లేదని వైసీపీ నేత‌లు ఆమె పెన్షన్‌ను తొలగించారని ఆరోపించారు.

ఈ విష‌యాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి అక్ర‌మంగా కేసు పెట్టారని తెలిపారు. దీంతో వాస్తవాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వేణుగోపాల్ పై ఎస్ఐ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ దాడి చేశార‌ని పేర్కొన్నారు. ఎస్ఐ తీరు స‌రికాద‌ని, వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించార‌ని చెప్పారు. ఎస్ఐ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement