Saturday, April 27, 2024

TTD : సిద్దమైన ఎం ఈ ఐ ఎల్ ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల నమూనా

హైదరాబాద్ : మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ )తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది. ఎం ఈ ఐ ఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్​ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది. తి తి దే మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును గురువారం దేవస్థానముల రవాణా విభాగం జనరల్ మేనేజర్ పి వీ శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)కు అందించాలని ఎం ఈ ఐ ఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు టీటీడి వినియోగించనుంది. టి టి డి అధికారులకు బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సుల్లో ఎలెక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తోందో తెలిపే వివరాలు పొందుపరిచారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది, తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సు పై పొందు పరిచారు. బస్సులో కొద్దిదూరం ప్రయాణించిన శేషారెడ్డి బ‌స్సు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం తో పాటు దేవస్థానం పాలకవర్గం, ఉన్నతాధికారులకు దాని పని తీరును వివరిస్తానని తెలిపారు. ఎం ఈ ఐ ఎల్ విద్యుత్ బస్సులను అందించటం సంతోషంగా ఉందని, వీటి వల్ల తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ జరుగుతుందని అన్నారు.

శబ్ధ, వాయు కాలుష్యంలేని ప్రయాణం..

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ.ప్రదీప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ఎం ఈ ఐ ఎల్ భగవంతుని సేవలో ఎప్పుడూ ముందుంటుంది. సంస్థ ప్రయాణంలో వేంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వాదాలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలుగుతున్నాం. సంస్థ పురోగతి, భవిష్యత్తు ప్రయత్నాలలో ఆ స్వామివారి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నాం. 9 మీటర్ల పొడువున్న 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో అందించనున్నాం. ఈ-బస్సుల కోసం ఛార్జీంగ్​ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు పరిశుభ్రమైన, వాయు, శబ్ధ కాలుష్యంలేని ప్రయాణాన్నిఈ విద్యుత్ బస్సుల ద్వారా అందిస్తామని ప్రదీప్ తెలిపారు. ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిరుమలలో 12 డీజిల్ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం అయితే తి తి దే కు డీజిల్ ఖర్చుల భారం తగ్గటంతో పాటు పర్యావరణం మెరుగు పడేందుకు ఎంతో అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఆర్ టి సి) ఆధ్వర్యంలో 50 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజూ తిరుపతి , తిరుమల మధ్య నడుస్తూ భక్తులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement