Sunday, May 19, 2024

టిడ్కో ఇళ్లు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి : సీఎం జగన్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయడంతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసి లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు వివరించారు. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనా పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ. 4500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు వివరించారు. అనంతరం నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. 16,762 రోడ్లకు సంబంధించి 4396.65 కి.మీ మేర రోడ్లు నిర్మాణం కోసం.. రూ.1826.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. వీటితోపాటు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామని, జూలై 15 నాటి కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామని, ఇప్పటికే 51.92శాతం పనులు పూర్తి చేశామని అధికారులు వివరించారు. అదే సమయంలో మురుగునీటి జలాల శుద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

కృష్ణా గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయని, శుద్ధి చేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలని, ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రధాన నగరాలతో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచనలు చేశారు. సమగ్రమైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారానే ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వగలుతామని, ఇందులో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే మనం జీతాలు పెంచామని, ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది జీతాన్ని 50 శాతం పెంచి, రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో వారిని ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ప్రజారోగ్యం కోసం వారు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, ఈ పనులను ఎవ్వరూ కూడా చేయలేరని, అందుకే చలించి జీతం పెంచామని వివరించారు. విజయవాడలో కాల్వల సుందరీకరణపైనా నివేదిక ఇవ్వాలన్న సీఎం పంటకాల్వల్లో చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మ్యాపింగ్‌చేసి కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, అక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు.

జగనన్న హరిత నగరాలు కార్యక్రమంపై సమీక్షిస్తూ.. ఎయిర్‌ పోర్టులనుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని, గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నంకు వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలని, ఈ పనులు నగరం అందాలను మెరుగుపరిచేలా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధిచేసి అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ ప్రారంభం కావాలని, నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలను సత్వరమే పూర్తిచేయాలని, అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. సీఆర్డీఏ కింద పనుల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని, క్వార్టర్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని, సీడ్‌ యాక్సిస్‌ రోడ్లలో నాలుగు గ్యాప్స్‌ను పూర్తిచేసే పనులు మొదలవుతాయని అధికారులు వివరించారు. జూలైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 6 చోట్ల నడుపుతున్నామని తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు- చేసిన మార్టులు ఎలా నడుస్తున్నాయో సమీక్ష చేయాలన్న సీఎం జగన్‌.. అవి సమర్ధవంతంగా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement