Saturday, April 27, 2024

ఈ మైనర్లు మహా ముదుర్లు.. మహిళలు పూలకు వెళ్లటం చూసి..

వారిద్దరి వయసు 17 ఏళ్లు. వీరిద్దరూ జువైనల్ హోమ్‌లో స్నేహితులుగా మారారు. సంక్రాంతి పండుగ వారికి మరింత సరదాగా మారిపోయింది. చేతిలో డబ్బులు అయిపోవడంతో చోరీలకు ప్లాన్ చేశారు. మహిళలు పూలు కోసేందుకు వెళ్లగా… ఇళ్లలోకి దూరి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

విజయనగరం జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు మైనర్‌ బాలురను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. వారి నుండి 12 తులాల గోల్డ్‌ స్వాధీనం చేసుకున్నారు. కాకినాడకు చెందిన ఓమైనర్‌ బాలుడు, విజయనగరానికి చెందిన మరో బాలుడితో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇందులో ఓ మైనర్‌ బాలుడిపై ఏకంగా 52 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీళ్లిద్దరూ విజయనగరం జువైనల్‌ హోమ్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. సంక్రాంతికి బయటకు వచ్చి.. సరదాగా బయట తిరిగారు. చేతిలో డబ్బులు అయిపోవడంతో దొంగతనాలకు ప్లాన్ వేశారు.

విజయనగరం జిల్లా పులిగెడ్డవారి వీధిలో తెల్లవారుజామునే మహిళలు తోటలలో పూలు కోసేందుకు వెళ్తుంటారు..ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన ఇద్దరు మైనర్‌ దొంగలు వారు ఇంటి నుంచి బయటకు వెళ్లగానే ఇళ్లలోకి చోరబడి బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చిన మహిళలు.. బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు మైనర్లను విచారించారు. వారు చేసిన నేరాలను ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. కేసును వేగవంతం చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ అనిల్ కుమార్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement