Thursday, May 2, 2024

అదనపు విమానాలు పంపండి, విద్యార్థుల తరలింపు వేగవంతం చేయండి: టీడీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రొమేనియా, హంగేరీ దేశాలకు అదనపు విమానాలు పంపి విద్యార్థుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రులు జయశంకర్, జ్యోతిరాదిత్య సింధియా, హర్దీప్ సింగ్ పూరీకి శనివారం లేఖలు రాశారు. ఉక్రెయిన్ నుంచి బయటపడి రొమేనియా, హంగేరీ చేరుకున్న విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు పంపేందుకు అదనపు విమానాలను పంపాలని రామ్మోహన్ నాయుడు కోరారు.

సుమారు 507 మంది విద్యార్థులు రొమేనియా, హంగేరీ సరిహద్దులు దాటి విమానాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. భయానక పరిస్థిలను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సరిహద్దుల్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని కేంద్ర మంత్రులకు తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను రామ్మోహన్ నాయుడు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement