టీడీపీ తరుపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రచార హోరు మే 6వ తేదీ వరకు కొనసాగనుంది..
ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేశ్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారం రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఏప్రిల్ 30న ఒంగోలులో ప్రారంభం కానున్న లోకేశ్ పర్యటన… మే 6న ఏలూరు వరకు కొనసాగనుంది.
ఈనెల 30న ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలు కొనసాగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో సాగే ముఖాముఖి సమావేశాల్లో యువతీయువకుల సందేహాలను లోకేశ్ నివృత్తి చేస్తారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ యువతతో నిర్వహించిన ‘హలో లోకేశ్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అదే తరహాలో కొనసాగే యువగళం సభలకు భారీ ఎత్తున యువతీయువకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కూటమి ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతిరోజూ ఓ పార్లమెంటు కేంద్రంలో నిర్వహించే ఈ ముఖాముఖి సమావేశాల్లో… రాబోయే ఎన్నికల్లో యువత నెరవేర్చాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు తాము ఏ విధంగా భరోసా కల్పిస్తామో లోకేశ్ వివరిస్తారు.
ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల ద్వారా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగం వచ్చేవరకు యువగళం పేరుతో ప్రతినెలా 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి హామీలపై యువతకు అవగాహన కల్పిస్తారు.