Saturday, April 27, 2024

అయిదు లక్ష‌ల మందితో 14న జ‌న‌సేన 10వ ఆవిర్భావ స‌భ‌..

మచిలీపట్నం, మార్చి 8( ప్రభ న్యూస్): రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు పై పాలకులు ఏం చేయాలో దిశ నిర్దేశం చేసేలా జనసేన పదవ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశామని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నంలో ఈనెల 14న జరగనున్న జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను నాదెండ్ల పరిశీలించారు. అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లా విస్తృస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రజల పక్షాన నిలబడి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా జనసేన ముందు వరుసలో నిలబడి పోరాడింది అన్నారు. రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని విధంగా బహిరంగ సభకు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 34 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, మరో 60 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడానికి కూడా రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ భూములను అందజేశారని తెలిపారు. సభకు వచ్చిన వీర మహిళలు, జనసైనికులు, ప్రజలు తిరిగి గమ్యస్థానం సురక్షితంగా వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ 14వ తేదీ రెండు గంటలకు మంగళగిరి వారాహి వాహనం పై బయలుదేరి సభా ప్రాంగణానికి సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటారని తెలిపారు.

కృష్ణా జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని వేదిక మీద పవన్ కళ్యాణ్ అందజేస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన అనంతరం రాష్ట్రంలో మూడు వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కృష్ణాజిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 51 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. తమ పార్టీ బృందం ఆత్మహత్యల వాస్తవ లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించనున్నట్లు చెప్పారు. 25 మంది క్రియాశీలక సభ్యులు ఇచ్చిన వారికి ప్రత్యేకంగా స్పెషల్ పాసులు ఇచ్చి వారికి ప్రత్యేకించి గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మందిని గుర్తించామన్నారు. ఐటీ, సోషల్ మీడియాలో తమ సేవలందిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసామన్నారు. మచిలీపట్నం పరిసరాల లోని 10 నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా జన సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ఇద్దరు సమయకర్తలను, జిల్లా కమిటీ నుంచి ఒక సభ్యుడు కేటాయించి,ఆ ముగ్గురు కలిసి సభ విజయవంతం గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. పోలీసు శాఖ సూచనలు అనుగుణంగా బారికెట్లు, లైటింగ్, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు బండి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తొలుత మూడు మూడు స్తంభాల సెంటర్ నుంచి బైక్ ర్యాలీతో జనసైనికులు నాదెండ్ల మనోహర్ ని సభా వేదికకు తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement