Wednesday, May 8, 2024

AP: పదిరోజుల పాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి… జగన్

పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న అమ్మ ఒడి అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బ‌హిరంగ స‌భ వేదిక‌గా పిల్ల‌ల‌ను బ‌డికి పంపించే త‌ల్లుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నామన్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టి నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించామన్నారు.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నామన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ చదువులకు దూరం కారాదనే సంకల్పంతో విద్యారంగంపై పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చి ప్రైవేట్‌ స్కూళ్లే సర్కారు విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితిని కల్పించామన్నారు. పేద విద్యార్థులను గ్లోబల్‌ స్టూడెంట్లుగా తీర్చిదిద్దుతూ ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ విధానంలో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసి బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ ఉచితంగా అందిస్తున్నామన్నారు. పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. నాడు–నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో ఆరు, ఆపై తరగతుల నుంచి డిజిటల్‌ తరగతి గదులను తీసుకొచ్చామన్నారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నామన్నారు. మన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉన్నత చదువులు చదివేలా జగనన్న విదేశీ విద్యా దీవెనతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఆదుకుంటున్నామన్నారు. స్పోకెన్‌ ఇంగ్లీషులో నైపుణ్యాలను సాధించేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్‌’ పరీక్షలకు సన్నద్ధం చేసి సర్టిఫికెట్లు అందించేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement