Thursday, May 9, 2024

పేరుకే హోం ఐసోలేష‌న్ – తెగ తిరిగేస్తున్నారు..

అమరావతి, : ఒక కరోనా బాధితుడి నుంచి 30 మందికి వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అందుకే కోవిడ్‌ వైరస్‌ సోకిన బాధితులు 14 రోజుల వరకు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్‌ సోకిన వ్యక్తి ప్రజల మధ్యలో తిరిగితే వైరస్‌ మరింత ఉదృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, అటువంటి పరిస్థి తుల్లో వైరస్‌ను కంట్రోల్‌ చేయడం కూడా కష్ట మవుతుందని ఇప్పటికే ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తుంటే.. అందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుతం కోవిడ్‌ బాధితులు విచ్చలవిడిగా బయట తిరిగేస్తున్నారు. గడిచిన రెండు వారాలుగా నమోదవుతున్న కేసుల సంఖ్య, రికవరీ అవుతున్న కేసులను ఒక్కసారి పరిశీలిస్తే రికవరీ శాతం కంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యే అత్యధికంగా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం కూడా అదే. వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన కూడా వారిలో లేదు
రాష్ట్రంలో మార్చి మొదటి వారం నుంచి సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. ఫిబ్రవరి చివరి వరకు రోజుకు పదుల సంఖ్యకే పరిమితమైన కొత్త కేసుల సంఖ్య మార్చి నుంచి రోజురోజుకు పెరుగుతూ వందల సంఖ్యకు చేరింది. ఏప్రిల్‌ మొదటి వారానికి ఆ సంఖ్య వేలకు చేరింది. తాజాగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన నెల రోజుల్లో 300 మందికి పైగా చనిపోయారు. దీన్నిబ ట్టి చూస్తుంటే రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ఎంత ప్రమాదకరంగా దూసుకొస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనా బాధితులు మాత్రం కొంతమంది తమవల్ల వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుందన్న భయం కూడా లేకుండా సమాజానికి మరింత వైరస్‌ను అంటించేలా వ్యవహరిస్తున్నారు. కనీసం తమకు పాజిటివ్‌ సోకిందన్న విషయాన్ని కూడా ఇరుగుపొరుగు వారికి, స్నేహితులకు చెప్పకుండానే సాధారణ రోజుల్లో వారితో కలిసి నట్లుగానే ప్రస్తుతం కూడా కలిసి తిరుగుతున్నారు. దీంతో సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఇలా అయితే.. మరింత ప్రమాదం తప్పదు
రాష్ట్రవ్యాప్తంగా శనివారం 11698 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 81471 మంది చికిత్స పొందుతున్నారు. దీన్నిబట్టి చూస్తే రికవరీ శాతం కంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం కరోనా బాధితులు విచ్చలవిడిగా బయట తిరగడమే. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం కోవి డ్‌ బారిన పడిన 81471 మంది కాగా.. అనధికారికంగా మరో 50 శాతం మంది కోవిడ్‌ బాధితులున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో ల్యాబ్‌లలో అనధికారికంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. వారిలో అత్యధిక శాతం మంది ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన కరోనా బాధితుల్లో కూడా 60 శాతం మంది వరకు హోం ఐసోలేషన్‌లో ఉండడానికి అనుమతులు తీసుకుంటున్నారు. వారిలో 50 శాతం మందికి పైగా బాధితులు వారి వారి అవసరాల దృష్ట్యా బయటకు వస్తున్నారు. దీంతో సెకండ్‌ వేవ్‌ కేసుల సంఖ్య పదులు, వందలు దాటి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. పరిస్థి తి ఇలాగే కొనసాగితే రానున్న వారం పదిరోజుల్లో ప్రమాద స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ బాధితులు పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌ రిపోర్టు వచ్చేవరకు జాగ్రత్తగా ఉండడంతో పాటు వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా హోం ఐసోలేషన్‌ బాధితులపై నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement