Monday, May 20, 2024

Exclusive – కూట‌మి దరహాసం… బెజవాడ రోడ్ షో సక్సెస్‌తో మోదీ హర్షాతిరేకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్ధుల కోసం స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగడంతో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఎన్డీఏ త్రిమూర్తులు ఆనందంతో పరవశించిపోయారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తమ ట్వీట్లల్లో హర్షం వర్షం కురిపించారు. రాజకీయ చైతన్య వేదిక విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగింది. కిలో మీటర్నర కొనసాగిన రోడ్ షోలో ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయిదు వేల మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ షో కోసం నగరంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. విజయవాడలో ప్ర‌జ‌లు బ్రహ్మరథం పట్టారు. గత నెలలో సీఎం జగన్ రోడ్ షోను మించిన రీతిలో జన సమీకరణ జరిగింది. ఇక ఎన్డీయే రోడ్ షోలో పొత్తు గెలవాలి..జగన్ రెడ్డి పోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దారి పొడవున మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ త్రయాన్ని చూడటానికి జనం బారులుతీరాలు. కాషాయ, పసుపు జెండాలు పట్టుకొని కూటమి గెలవాలంటూ నినాదాలు చేశారు.

జ‌గ‌న్ పాల‌న అంతం : మోదీ ట్వీట్

బెజవాడ రోడ్ షోకి ప్రజలస్పందనకు మోదీ మైమరపి పోయారు. అద్భుతంగా ఎన్డీయే కూటమి బలాన్ని, వైసీపీ స్థితిని వివరిస్తూ ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని ..ప్రజలు కూటమి అభ్యర్ధులకు ఓట్లు వేస్తారనే విషయం అర్దమైందన్నారు. యువత, మహిళల మద్దతు ఎన్డీఏ కూటమికే ఉందని అభిప్రాయపడ్డారు. వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. జూన్ 4 వైసీపీకి చివరి రోజని మోదీ జోస్యం చెప్పారు.

- Advertisement -

చంద్రన్న సంబంరం

మోదీ రోడ్ షో సక్సెస్ కావడం,చంద్రబాబు చలించిపోయారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ఇది మరపురాని రోడ్ షో అంటూ తన‌ అనుభూతిని షేర్ చేశారు. ఏపీకి భరోసా ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, నేను, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయింద‌న్నారు.

ఈ అనుభూతి మ‌రిచిపోలేనిది: ప‌వ‌న్ కళ్యాణ్

పవన్ కల్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం విలువైన సమయాన్ని కేటాయించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పోస్ట్ పెట్టారు.

అనుమానాలకు తెర

ఏపీలో మూడు పార్టీలు జత కట్టినప్పటికి ఇప్పటి వరకు మూడు పార్టీలకు చెందిన అగ్రనాయకులు ఈవిధంగా ఒకే ప్రచారంలో పాల్గొనకపోవడంతో ప్రజల్లో ఈ కూటమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బుధవారం రోడ్ షోతో అందరికి క్లారిటీ వచ్చింది. మరోవైపు వైసీపీకి జూన్4 చివరి రోజని ప్రధాని చేసిన ట్వీట్ పై అధికార పార్టీలో గుబులు మొదలైంద‌నే భావ‌న వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement