Friday, April 26, 2024

వైభ‌వంగా తిరుమ‌ల శ్రీవారి మెట్లోత్స‌వం.. పోటెత్తిన భ‌క్తులు

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది. ముందుగా సుగుణేంద్రతీర్థస్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ జరిపారు. భజనమండళ్ల స‌భ్యులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుగుణేంద్రతీర్థస్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు మ‌హ‌ర్షులు సూచించిన మార్గంలో న‌డిచి శ్రీ‌వారి వైభ‌వాన్ని, ధ‌ర్మ ప్రచారాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని ఉద్ఘాటించారు.

బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని గుర్తుచేశారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో ఈ మెట్లోత్సవాన్ని నిర్వహించడం ముదావహమన్నారు.వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించారు. భజన మండళ్ల సభ్యులకు టీటీడీ మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3,500 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement