Tuesday, April 30, 2024

స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రముఖ ఆలయాల ప్రసాదాలు….

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను భక్తుల దగ్గరకు నేరుగా చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసిన‌ట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. త‌పాలశాఖ ద్వారా ఇంటికే దేవుళ్ళ ప్రసాదాలు, మొబైల్ యాప్ ద్వారా పూజ సేవ‌లను శ‌నివారం అర‌ణ్య భ‌వ‌న్‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ‌లోని 10 ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలైన యాదాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహాస్వామి దేవస్థానం, భ‌ద్ర‌చ‌లం శ్రీ సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యం, వేముల‌వాడ -శ్రీరాజ‌రాజేశ్వ‌ర ‌స్వామి ఆల‌యం, బాస‌ర శ్రీ జ్ఞాన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి దేవ‌స్థానం, కొండ‌గ‌ట్టు అంజ‌నేయస్వామి టెంపుల్, కొముర‌వెల్లి మ‌ల్లికార్జునస్వామి ఆల‌యం, ఉజ్జ‌యిని మ‌హాంకాళీ ఆల‌యం, సికింద్రాబాద్ గ‌ణేష్ టెంపుల్, బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌- పోచమ్మ టెంపుల్‌, కర్మాన్‌ఘాట్ హ‌నుమాన్ దేవాల‌యం ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్‌లో రాష్ట్రంలో ఎక్కడికైనా పంపే విధంగా పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చ‌కున్నామ‌న్నారు. ప్రసాదం (డ్రై పూట్స్ ) హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు నేరుగా ఏ పోస్ట్ ఆపీసుకైనా వెళ్లి బుక్ చేసుకోవ‌చ్చని తెలిపారు. పోస్ట్ ఆఫీసులో భక్తులు తమకు నచ్చిన గుడిలో ప్ర‌సాదాల‌కు రుసుం చెల్లిస్తే వారి పేరిట ప్రసాదాలను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తార‌ని పేర్కొన్నారు. ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ప్రసాదాన్ని స్పీడ్ పోస్టులో భక్తుల ఇంటికి డోర్ డెలివరీ చేస్తార‌ని వివ‌రించారు. దేశ వ్యాప్తంగా 1.60 ల‌క్ష‌ల పోస్టాఫీసుల ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌న్నారు. దీంతో పాటు ఆల‌య పూజ‌ సేవ‌ల బుకింగ్ ల‌ను కూడా త‌పాల శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్న‌ట్లు తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్‌లో పూజ‌ సేవ‌ల‌ను బుక్ చేసుకోలేని వారికోసం పోస్ట్ ఆఫీసులో ఆఫ్ లైన్ ద్వారా ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement