Tuesday, May 14, 2024

Kurnul – పిట్ట కథల మంత్రికి, కట్టు కథల సీఎంకు ఇక రాజకీయ సన్యాసమే – చంద్ర బాబు

కర్నూలు, ఏప్రిల్ 29, ప్రభ న్యూస్ బ్యూరో.రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి కాలం చెల్లిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లుగా సచివాలయానికి రాని సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా, డోన్ , నందికొట్కూరులో సోమవారం ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ….డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాశ్ రెడ్డిని, ఎంపీగా శబరిని గెలిపించాలనీ కోరారు. డోన్ సభ జనంతో అదిరిపోయిందన్నారు…జగన్ ముఠా సీన్ మారిపోయింది. పిట్ట కథల మంత్రి, కట్టు కథల నాయకుడికి రాజకీయ సన్యాసం తప్పదన్నారు.ఇక్కడున్న మంత్రి కథలు చెప్పడంలో ధిట్ట. ఆ మంత్రి వల్ల నియోజకవర్గం ఏమైనా బాగుపడిందా అంటే ఏమీ లేదన్నారు.ఆర్ధిక మంత్రి కాస్త అప్పుల మంత్రిగా మారిపోయాడన్నారు.ఈ బుగ్గన అప్పులు తెస్తే.. ప్రజలు తీర్చాలా? మే 13న సీఎంతో పాటు మంత్రి కూడా మాజీ కాబోతున్నారని ఎద్దేవా చేశారు. తర్వాత ఎక్కడికి పారిపోతాడో ఎవరికీ తెలియదన్నారు. ఈ పిట్టకథల మంత్రి చెప్పే కబుర్లు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

.

- Advertisement -

*విజన్ కు…విధ్వేషానికి మధ్య పోరాటం*

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు.. విధ్వంస పాలనకు.. అభివృద్ధికి సవాల్ లాంటివన్నారు. నీతికి అవినీతికి మధ్య జరిగే పోరాటంగా చంద్రబాబు పేర్కొన్నారు.విజన్ కి విధ్వేషానికి మధ్య, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం అన్నారు. రాతియుగం రాక్షసులకు.. స్వర్ణయుగం సాధకులకు మధ్య ఇది ఇది ఒక పోరాటంగా తెలిపారు.ఇక్కడున్న బుగ్గనకు, అక్కడ సైకో జగన్ రెడ్డికి ఒళ్లంతా అహకారం పెరిగిపోయిందన్నారు. తమ అహంకారంతో వ్యవస్థల్ని నాశనం చేశారన్నారు. అభివృద్ధిని విచ్ఛిన్నం చేయడం జరిగిందన్నారు.

ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన దొంగల్ని వదిలి పెట్టకూడదన్నారు. జగన్ రెడ్డి ముఠా దోపిడీ ఏ స్థాయికి చేరిందంటే.. చట్టాన్ని వ్యవస్థల్ని చేతల్లోకి తీసుకుని దోచుకుంటుందన్నారు. శాశ్వతంగా ఉండిపోతామనే భ్రమలో ప్రజల ఆస్తుల కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పరదాలు కట్టుకుని తిరిగే ఈ సైకో.. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మళ్లీ బుగ్గలు నిమురుతున్నాడు. గతంలోనూ ఇలాగే ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సచివాలయానికి పోనివాడికి ఆ పదవిలో ఉండే హక్కుందా? అని ప్రశ్నించారు.ఐదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా సచివాలయానిక వెళ్లలేదన్నారు. ప్రజలకు చేసింది ఇదీ అని మీడియా ముందు చెప్పలేని సన్నాసి రాష్ట్రానికి అవసరమా అన్నారు.సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు..

*సీమలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారా…ఒక్క పరిశ్రమైనా తెచ్చారా.?*

పరిపాలన అంటే అప్పులు కాదు, హరికథలు చెప్పడం కాదని బుగ్గన తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ధిక వ్యవస్థను పటిష్టపర్చాల్సింది పోయి.. సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత వైసిపి ప్రభుత్వందే అన్నారు. ఆస్పత్రులు, రైతు బజార్లు సహా చివరికి మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారంటే వీరిని ఏమనాలి? అని ప్రశ్నించారు. రాయలసీమకు జగన్ రెడ్డి ఏమైనా చేశాడా? ఒక్క ప్రాజెక్టు కట్టాడా? ఎక్కడైనా రోడ్డేశాడా. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఇలాంటి వారికి మరోసారి ఓటు అడిగే హక్కుందా అన్నారు. జగన్ రెడ్డి రంగుల పిచ్చికి రూ.3500 కోట్ల ప్రజా సొమ్ము వృధా అయిందన్నారు. ఇప్పుడు ప్రజలంతా ఏకమై రంగుల పిచ్చోడిని శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు. బడికి, గుడికి, చెట్టుకి, పుట్టకు కూడా రంగులేసుకున్న ఘనత వైసిపిదే అన్నారు.గతంలో ఎప్పుడైనా ఇలాంటి పిచ్చోడిని చూశామా? మరోవైపు ఏం సలహాలిచ్చారో తెలియదు గానీ వందల మంది సలహాదారుల్ని నియమించి రూ.700 కోట్లు వారికి ధారబోసినట్లు తెలిపారు.

సాక్షి పత్రికకు ప్రకటనల పేరుతో రూ.1000 కోట్లు దోచిపెట్టాడనీ చంద్రబాబు పేర్కొన్నారు.రాయలసీమ ప్రజలకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై పైసా ఖర్చు చేయలేదన్నారు. కానీ సొంత పేపర్ కు ప్రజల సొమ్ము ధారపోశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రజల పట్టాదారు పాస్ పుస్తకాలపై కూడా జగన్ ఫోటో వేసుకునన్నాడన్నారు.ఇదేమైనా జగన్ రెడ్డి తాత ఆస్తా? అని ప్రశ్నించారు. ప్రజలకు చెందిన పొలం చుట్టూ ఫోటోలతో సర్వే రాళ్లు వేశాడు. ఇప్పుడు ప్రజల భూములన్నీ జగన్ రెడ్డి తన పేరుతో రాసుకుంటున్నట్లుగా ఉందన్నారు. బ్రిటీషు కాలం నుండి ప్రతి ఒక్కరికీ భూమి రికార్డులున్నాయి. అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ మన పేరుతో ఉన్నాయి. కానీ, అన్నీ ఆన్ లైన్లో పెట్టేస్తానంటు నాటకాలకు తేరతిస్తున్నారన్నారు. అక్కడ పేరు మార్చేస్తే మన జీవితాలు బుగ్గై పోతాయి అన్నారు.

ఒంటి మిట్టలో ఇలాగే ఒక చేనేత కార్మికుడి భూమిని వైసీపీ నేతలు రాయించుకుంటే ఏమీ చేయలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మీ భూమి కొట్టేయడానికి వస్తున్న సైకోని తరిమికొట్టాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మనం ఏమీ చేయలేని పరిస్థితి దాపురిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడంటే ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టి పేదల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారన్నారు.

*ఏ ఒక్క రైతన్నా సంతోషంగా ఉన్నారా.?*

ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజల జీవితాలు దుర్బరంగా మారిపోయినట్లు చెప్పారు. ఆదాయం పెరగలేదు గానీ ఖర్చులు పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలను నాశనం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. డోన్ సభలో అడుగుతున్నా.. రాష్ట్రంలో ఏ రైతు అయినా బాగున్నాడా? వ్యవసాయాన్ని చంపేశాడు. రైతు మెడ నొక్కేయడంతో దీనావస్థలో ఉన్నారు. గత ఐదేళ్లలో హార్టీకల్చర్ ఏమైనా బాగుపడిందా? అని ప్రశ్నించారు.డ్రిప్ ఇరిగేషన్ గతంలో 90శాతం సబ్సిడీతో అందించాము,ఇప్పుడు ఇస్తున్నారా? వ్యవసాయం ఎండిపోతోంది. హార్టీకల్చర్ హబ్ గా ఉండాల్సిన రాయలసీమను నాశనం చేశారన్నారు. పండ్లు, కూరగాయలతో కళకళలాడాల్సిన సీమ రైతు ఆందోళనతో ప్రాణాలు వదిలి పరిస్థితికి చేరుకుందన్నారు. అందుకే అన్నదాత పథకంతో ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇచ్చి అండగా నిలుస్తామన్నారు. మన హామీలన్నీ ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలు పని చేయాలనీ చంద్రబాబు పిలుపునిచ్చారు. గడపగడపనా మన హామీలు వివరించాలఎన్నారు

*పెరిగిన ధరలతో ప్రజలు భయపడుతున్నారు*

నిత్యావసర వస్తువుల ధరలు గతంలో ఎంత ఉన్నాయి. ఇప్పుడెంతున్నాయి. కిరాణా షాపుకెళ్తే పేదలు భయపడిపోతున్నారనీ చంద్రబాబు పేర్కొన్నారు పెరిగుతున్నప్పుడునప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రూ.60 ఉన్న క్వార్టర్ మద్యం ఇప్పుడు రూ.200 చేశాడు. పెరిగిన రూ.140 ఎవరి జేబుల్లోకి పోతున్నాయనీ ప్రశ్నించారు.గతంలో కొద్దో గొప్పో ఇంటికి వచ్చే సొమ్మును ఈ జగన్ రెడ్డి గుంజుకుంటున్నట్లు చెప్పారు. కల్తీ మధ్యం కారణంగా 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. జగన్ తన ధన దాహం కోసం వేలాది మంది మహిళల మాంగళ్యాలు తెంచాడన్నారు.. నాసిరకమైన మద్యాన్ని అరికట్టే బాధ్యత నాది. జే బ్రాండ్లు కనిపించకుండా చేస్తానన్నారు. దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఏపీలో జగన్ రెడ్డి చేస్తున్న లిక్కర్ స్కాం చాలా పెద్దదన్నారు. ఈ సారా ముఠాను రాష్ట్రం నుండి తరిమికొడదామన్నారు. మరోవైపు ఏ కిల్లీ కొట్టుకు వెళ్లినా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. మన పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఇలాంటి పార్టీ మనకు అవసరమా? బిడ్డల భవిష్యత్తే తల్లిదండ్రులకు ముఖ్యం. కానీ, జగన్ రెడ్డి చేస్తున్న ఈ అరాచకం నుండి మీ బిడ్డల్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటా అన్నారు.

*నేనొస్తే కరెంట్ ఛార్జీల పెంపు ఉండదు*

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. నేనొస్తే కరెంటు ఛార్జీలుండవ్. తిరిగి కరెంటు మిగులు చేసేలా ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు.ఆ కరెంటును అమ్మి సొమ్ము చేసుకునే ప్రణాళికలు నావి. తన కమిషన్ల కోసం బయట మార్కెట్లో కరెంటు కొని జలగలా రాష్ట్రాన్ని పీల్చడం జగన్ రెడ్డి తెలివితేటలుగా పేర్కొన్నారు.ఆర్టీసీ చార్జీలు పెంచాడు. చెత్తపై పన్ను వేశారాన్నారు. తాను అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తా. ఈ గాలి మనుషుల్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టడం ఖాయమన్నారు.

ఐదేళ్లలో ఎవరికైనా ఉద్యోగాలొచ్చాయా? ఉద్యోగాల గురించి అడిగితే మటన్ షాపులు, ఫిష్ మార్టుల్ని చూపిస్తున్నాడన్నారు. వాలంటీర్ ఉద్యోగాలంటున్నాడు. నేను లక్షల రూపాయల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జలగ వచ్చి రూ.5వేల వాలంటీర్ ఉద్యోగాలు అంటున్నాడు. జాబు కావాలంటే బాబు కావాలి. మన ప్రభుత్వం వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన ఉపాధి కల్పించే బాధ్యత తనదన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చి, అంత వరకు నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు.యువతను నైపుణ్యాభివృద్ధికి వీలుగా జనగణన నిర్వహిస్తామన్నారు. వారు ఎంపిక చేసుకున్న రంగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. యువత భవిష్యత్తు బంగారు మయం కావాలంటే.. కూటమి అధికారంలోకి రావాల్సిందే అన్నారు

.

*ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ*

డోన్‌లో అన్ని రకాల ఉద్యోగులున్నారు. వారిలో ఏ ఒక్కరికైనా గత ఐదేళ్లలో న్యాయం జరిగిందా? ఉద్యోగుల పాలిట రాక్షసుడిలా జగన్ మారారన్నారు. ఏ ఉద్యోగికి స్వేచ్ఛ లేదు. సీపీఎస్ రద్దు హామీ ఏమైంది జగన్ రెడ్డీ? అని తాను హామీ ఇస్తున్నా.. సీపీఎస్ విషయంలో ప్రత్యేక విధానం రూపొందించి ఉద్యోగులకు న్యాయం చేస్తానన్నారు. డీఏ సకాలంలో ఇచ్చిన దాఖలాలు లేవు. పోలీసులకు డీఏ గానీ, పీఆర్సీ గానీ ఇచ్చారా? 2014లో విభజన సమయంలో ఎన్నో ఆర్ధిక కష్టాలున్నా తెలంగాణతో సమానంగా 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. కానీ, జగన్ రెడ్డి ఐదేళ్లుగా ఫిట్ మెంట్ ఇవ్వకపోగా ఎగ్గొట్టాడన్నారు. రివర్స్ పీఆర్సీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఉద్యోగులంతా సమైక్యంగా ఉండాలి.

. టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవ ప్రదంగా పని చేయడానికి అవసరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందన్నారు. పెన్షనర్లకు గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఒకటో తేదీన పెన్షన్ వచ్చిందా? అని ప్రశ్నించారు.ఉద్యోగులకు రూ.25 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టాడు. ఉద్యోగులందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. పీఆర్సీ, పెన్షన్ సకాలంలో ఇచ్చి అండగా నిలుస్తానన్నారు. సంపద సృష్టించడం నాకు వెన్నతో పెట్టిన విధ్య. ఆ సంపదను అందరికీ పంచే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

.

*ఐదు కోట్ల మందికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా*

నాకు విశ్వసనీయత లేదని, నేనేమీ చేయలేదని ఈ జగన్ రెడ్డి చెబుతున్నాడు. మిస్టర్ జగన్ రెడ్డీ.. ఒకసారి హైదరాబాద్ వెళ్లి అడిగి చూస్తే తాను ఏమిటో తెలుస్తుందన్నారు. తన విశ్వసనీయత ఏంటో నా విజన్ ఏంటో. ప్రజా వేదిక వద్దకో, పోలవరం వద్దకో అమరావతి వద్దకో పోయి అడుగు నీ విశ్వసనీయత ఏంటో. నీ విజన్ ఏంటో. నీ విధ్వంసపు పాలన గురించి చెబుతారని ఎద్దేవా చేశారు.రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తే సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు.ప్రతి వ్యక్తికీ ఒక పేరు ఉంటుంది. అడ్రస్ ఉంటుంది. మరి మన రాష్ట్రానికి అడ్రస్ ఏదంటే సమాధానం లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన దుష్టుడు జగన్ రెడ్డియే అన్నారు.ఐదు కోట్ల మందికి అండగా నిలిచి, న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటాను అన్నారు.

.

బీసీలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. జయహో బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.బీసీలందరికీ న్యాయం చేసే బాధ్యత తనదన్నారు.బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించాను. ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసి బీసీలకు స్వయం ఉపాది కల్పిస్తాను అన్నారు. స్వయం ఉపాధి రుణాలు, ఆదరణ పథకంతో ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాను. చేతి వృత్తుల్లో ఆధునిక పద్దతులు తీసుకొచ్చి ఆర్ధికంగా సస్థిరపడేలా ప్రోత్సహిస్తానన్నారు. కర్నూలు పార్లమెంటు అభ్యర్ధిగా కురుబ వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాను. ఇద్దరు ఎమ్మెల్యేలుగా బోయలు, ఒక ఈడిగ సోదరుడు, ఒక లింగాయత్ వర్గాలకు అవకాశం కల్పించాను. మాదిగలకు రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాను. కానీ, జగన్ రెడ్డి సామాజిక విధ్వంసానికి తెరలేపాడు. కోట్ల కుటుంబం నుండి, బైరెడ్డి కుటుంబం నుండి అభ్యర్ధులుగా ఉన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలిచినట్లు చెప్పారు.

*నన్ను నమ్మినవాళ్లను వదులుకోను*

మొన్నటి వరకు పని చేసిన ధర్మవరం సుబ్బారెడ్డికి అనివార్య కారణాలతో సీటు ఇవ్వలేకపోయాను. కానీ, సుబ్బారెడ్డికి అండగా నిలిచి న్యాయం చేసే బాధ్యత తనదని చంద్రబాబు పేర్కొన్నారు. సూర్యప్రకాశ్ గెలుపు కోసం సుబ్బారెడ్డి వర్గం పని చేయాలన్నారు.నాతో కలిసి పని చేసిన వ్యక్తిని ఎప్పుడూ వదులుకోనన్నారు. ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరినీ కలవండి. దళితులకు జగన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని వివరించాలన్నారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. సమయం లేదు.. ప్రతి ఒక్కరూ గడపగడపకూ వెళ్లి జగన్ రెడ్డి చేసిన దగాను వివరించాలని చంద్రబాబు కోరారు. ప్రతి దళిత సోదరుడికి అండగా నిలుస్తామన్నారు. మాల మాదిగలకు న్యాయం చేస్తామన్నారు.

రాయలసీమలో బలిజలకు న్యాయం చేసింది కూటమి మాత్రమే అన్నారు. జగన్ రెడ్డి హడావుడి చేయడం తప్ప ఒక్క సీటు ఇవ్వలేదన్నారు. బలిజలు అధికంగా ఉండే తిరుపతి, రాజంపేట సీట్లు బలిజలకే ఇచ్చిన ఘనత కూటమిది అన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది కూటమే అని పేర్కొన్నారు.సామాజిక వర్గాలకు న్యాయం చేసిన కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కర్నూలు అసెంబ్లీ సీటును వైశ్య సోదరుడికి ఇచ్చాం. మన కూటమి అభ్యర్ధులు గెలవాలి. లేకుంటే వారికి కప్పం కట్టడానికి మన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందన్నారు

.

*సూపర్-6 పథకాలతో మారనున్న జీవితాలు*

తాను ఎప్పుడూ ఆడబిడ్డల పక్షపాతిగా చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీయే అన్నారు.చెల్లికి ఆస్తి లో వాటా ఇవ్వకుండా మెడపట్టి గెంటేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గా పేర్కొన్నారు. తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన ఘనత జగన్ రెడ్డి దక్కుతుందన్నారు. గతంలో డ్వాక్రా పెట్టాం. ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించామన్నారు. మహాశక్తి పథకంలో భాగంగా మహిళలకు 4 కార్యక్రమాలు రూపొందించినట్టు చెప్పారు. ఆడబిడ్డ నిధితో ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఎంత మంది ఉంటే అందరికీ ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. ప్రతి మహిళ తాను ఆర్ధికంగా స్థిరపడేలా చేసే బాధ్యత నాది. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాను. ప్రతి ఆడబిడ్డ ఆ ఇంటికి ఆర్ధిక మంత్రిగా ఎదిగేలా చేస్తామన్నారు.

.

*ముస్లింలకు అండగా ఉంటా*

డోన్‌లో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీతో కలిసి మసీదులు కూల్చేస్తానని బుగ్గన కథలు చెబుతున్నాడు. మైనార్టీలకు న్యాయం చేసింది తానే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఉర్ధూ యూనివర్శిటీ ఏర్పాటు చేసింది, ఉర్దూను రెండో భాషగా గుర్తించింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచామన్నారు. ఈ పథకాలన్నీ జగన్ రెడ్డి రద్దు చేసి మైనార్టీలను ఉద్దరించానంటున్నాడు

.

పార్లమెంటులో సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు మద్దతిచ్చి ఇక్కడ డ్రామాలాడుతున్నాడు. ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నిత్యం అండగా నిలిచింది తెలుగుదేశమే అన్నారు. నంద్యాలలో వైసీపీ నాయకుల వేధింపులతో అబ్దుల్ సలాం అనే మైనార్టీ సోదరుడు తన కుటుంబంతో కలిసి రైలు కింద పడి చనిపోయారు. నందికొట్కూరులో మసీదుకు వెళ్లి వస్తున్న మహిళ బురఖా ఎత్తి అవమానించిన వారిని ప్రశ్నిస్తే చెప్పులతో కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నేనుంటే అలాంటి వెధవల్ని మక్కులు ఇరగొడతానన్నారు.

*ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు*

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం. తాగు, సాగునీటి సమస్యల్ని పరిష్కరించి చూపిస్తాను. పెన్షన్ ప్రారంభించింది తెలుగుదేశమే. రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేసింది నేనే. కానీ, జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ముక్కుతూ మూలుగుతూ రూ.1000 పెంచాడు. ఏప్రిల్ నుండే పెన్షన్ పెంచి రూ.4000 ఇస్తామన్నారు.. కానీ, ఈ జగన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా.. ఎప్పుడో ఐదేళ్ల తర్వాత రూ.500 పెంచుతాడంట అని ఎద్దేవా చేశారు. ప్రతి అవ్వ తాతకు అండగా నిలుస్తాను. పెద్ద కొడుకుగా నేనుంటాను. ప్రతి పెన్షన్ దారుడికి ఏటా రూ.48 వేలు పెన్షన్ రూపంలో అందిస్తాను. దివ్యాంగులకు నెలకు రూ.6000 చొప్పున సంవత్సరానికి రూ.72 వేలు అందిస్తాను. సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతా. అంతేగానీ, ఈ జగన్ రెడ్డిలా అప్పులు చేయబోను. ప్రతి ఒక్కరిలో మనో ధైర్యం ఉన్నపుడు ఎంతటి వైకల్యమైనా మన ముందు దిగదుడుపే అన్నారు.దివ్యాంగులకు అవసరం మేరకు ఎలకట్రికల్ మోటార్ వాహనాలు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తాను. పిచ్చుక గూళ్లు కట్టించి ఊళ్లు కట్టానంటూ కథలు చెబుతున్నాడు. టిడ్కో ఇళ్లకు రంగులేసుకోవడం తప్ప పేదలకు పంచకుండా పాడుబెడుతున్నాడు. అధికారంలోకి రాగానే వాటిని పంచిపెట్టనున్నట్లు తెలిపారు.

రోడ్లకు మహర్దశ కల్పిస్తాను. ఇసుక అందుబాటులో ఉంచి నిర్మాణ రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాను. బుగ్గన ఆర్ధిక మంత్రో అప్పుల మంత్రో అర్ధం కావడం లేదు. ఎప్పుడూ నియోజకవర్గంలో ఉండడూ.. సచివాలయంలోనూ ఉండడు. అప్పుల కోసం చిప్ప పట్టుకుని ఢిల్లీలో తిరుగుతుంటాడఎన్నారు.రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి.. తాను మాత్రం మైనింగ్ లో వేల కోట్లు వెనకేసుకున్నాడన్నారు. గజేంధ్ర రెడ్డి అనే బంధువు ఏనుగులా కనిపించిన ప్రజల ఆస్తులన్నీ మింగేస్తున్నాడు. మైనింగ్, క్రషింగ్ యూనిట్లను కబ్జా చేశాడు. కర్ణాటక మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటున్నాడు. డోన్ లో దోచుకున్న డబ్బుతో దేశంలో ఎక్కడెక్కడో ఆస్తులు కూడబెట్టుకుంటున్నట్లు తెలిపారు.

*మైనింగ్ వ్యాపారులకు అండగా ఉంటా*

హంద్రీనీవా నీరు నియోజకవర్గానికి తీసుకొచ్చి సాగు నీటి సమస్య పరిష్కరిస్తా. సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించి హార్టీకల్చర్ ను ప్రోత్సహిస్తాను. అరటికి హబ్ గా డోన్ ను మారుస్తాను. పంటలకు గిట్టుబాటు ధరలు పొందేలాచర్యలు తీసుకుంటాను. కలర్ స్టోన్ పాలిషింగ్ పరిశ్రమకు రాయల్టీ తగ్గిస్తా. వేధింపులు లేకుండా చేసి చూపిస్తానన్నారు. ధర్మవరం సుబ్బారావు హామీ మేరకు ప్రతి ఒక్కరికీ సెంటున్నర స్థలం కేటాయించి ఇల్లు కట్టిస్తామన్నారు. జల దుర్గాన్ని మండలంగా చేస్తామన్నారు. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు గుండాల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తానన్నారు.అధికార పార్టీ నేతల కాల్ మనీ వ్యాపారాలను అరికడు తామన్నారు.600 మంది పాణ్యం సిమెంటు కార్మికులు ఉపాధి లేక రోడడ్డున పడ్డారు. వారందరికీ అండగా నిలుస్తామన్నారు. మే 13న మనం నొక్కే బటన్‌ నొక్కుడుకు జగన్ రెడ్డికి దిమ్మ తిరిగిపోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఒక బటన్, బైరెడ్డి శబరి కోసం మరో బటన్ నొక్కాలి. వీరి గెలుపు చూసి జగన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డోన్ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, నందికొట్కూరులో అభ్యర్థి జై సూర్య, పార్టీ ప్రముఖ నాయకులు మాండ్ర శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement