Saturday, May 18, 2024

‘శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ’

మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం. ఇందులోని ప్రతి అణువుకూ దేని ప్రత్యేకత, ప్రాధాన్యత దానిదే. అవగాహన చేసుకొనే కొద్దీ, లోతుగా పరిశీలించే కొద్దీ మనకెన్నో విశేషమైన విషయాలు గోచరమవుతూ ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఉదాహరణకు జ్ఞానేంద్రియాల లో ఒకటైన ‘నాలుక’ను గురించి పరిశీలిద్దాం.
కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే ఐదిం టినీ జ్ఞానేంద్రియా లు అంటాం. పరిసరాల నుండి ఇవి మనకు జ్ఞానాన్ని అందిస్తాయి. ఇవి శరీరా నికి కిటికీల వంటివి. కళ్ళద్వారా దృష్టి జ్ఞానము, చెవుల ద్వారా శ్రవణ జ్ఞానము, ముక్కుద్వారా ఘ్రాణ జ్ఞానము, నాలుక ద్వారా రుచి, చర్మం వలన స్పర్శ జ్ఞానాలను మనం పొందుతాం. నాలుకను మినహాయిస్తే మిగిలిన నాలుగు జ్ఞానేంద్రియాలకూ ఒక్కొక్క కర్తవ్యమే కేటాయించబ డింది. కళ్ళకు కేవలం చూడడమే పని. చెవులకు వినడం ఒక్కటే విధి. ముక్కు కేవలం గాలిని పీల్చ డం, వదలడం, వాసనలను పసిగట్టడం మా త్రమే చేస్తుంది. చర్మం స్పర్శను తెలుపుతుం ది. కానీ నాలుకకు మూడు పనులు కేటా యించబడ్డాయి. ఒకటి రుచిని తెల్పడం, రెం డు మాట్లాడటం, మూడు నోటిని నిరంతరం తడిగా ఉంచడం. మూడు పనులనూ ఎప్పు డూ ఓపికగా చేస్తూంటుంది నాలుక.
నాలుకకూ మానవజన్మకూ చాలా పోలికలున్నాయి. మనిషి భవ బంధాలకు కట్టుబడినట్లు, నాలుక కూడా ఒక కొన అం గిలికి అతుకబడి ఉంటుంది. దానిచుట్టూ పదునైన 32 దంతాలు మనుషులకు అరి షడ్వర్గాల వలె ఆవరించి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అశోకవనంలో సీతమ్మ చుట్టూ కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలలాగా ఉంటా యి. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆ దంతాల కింద సున్నితమైన నాలు క గాయపడక తప్పదు. జ్ఞాని ఎలా ఆకర్షణలకు అరిషడ్వర్గాలకు లొంగ కుండా జాగ్రత్త పడతాడో అలాగ నాలుక తనను తాను ఆ దంతాల బారి నుండి కాపాడుతూ, ఆహారాన్ని వాటి క్రిందకు జాగ్రత్తగా తోస్తూ, లాలా జలంతో కలిపి మెత్తని ముద్ద లా చేసి కడుపులోకి జారవిడుస్తుంది.
నాలుక చాలా నిరాడంబరంగా తన విధి నిర్వర్తిస్తుంది. మిగిలిన జ్ఞానేంద్రియాల వలె ఇది బయటకు కనపడదు కూడా. రోజుకొకసారి దంతధావనంతో బాటూ నాలుకనూ శుభ్రపరచుకొంటాం అంతేకానీ నాలుకకు ప్రత్యేకమై న సేవలు, మేకప్పులూ ఉండవు. అంతేకాదు తన తప్పును తానే సవరించుకొనే జ్ఞానిలా నాలుక తన గాయాలను తానే మాన్చుకొంటుంది. కంటికి నేత్రనిపుణులు, చెవులకు ఇఎన్‌టి నిపుణు లు, చర్మానికి స్కిన్‌ స్పెష లిస్టులు ఉన్నట్లు నాలుకకు ప్రత్యేక నిపుణులైన వైద్యుల అవసరం సాధా రణంగా లేదు. ఇంత గొప్పదనం కలది కను కనే నాలుక కడుపుకు కాపలా దారుగా నియమించబడింది. నాలుక రుచి చూచి నాణ్యతను పరీక్షించి అనుమతిస్తేనే కానీ ఏ పదార్థమూ కడుపు లోకి చేరదు. మనకు తగిన భుక్తినిచ్చి తద్వారా శారీరక శక్తిని ఇవ్వడంతో బాటు తన వాక్పటిమతో సమాజంలో కీర్తిని కూడా తెచ్చిపెడుతున్నది నాలుక. విద్వాంసులను ప్రశం సించేటప్పుడు వారికి విద్యలన్నీ నాలుక కొసనే ఉంటాయని చెప్పడం మనకు తెలిసిన విషయమే. వారి నాలుకపై సరస్వతి నాట్యమాడుతుందని పండితులను కీర్తిస్తుంటారు. అందుకే ఊరందరకూ ఉపకారిగా, ఆ గ్రామంలో ముఖ్యునిగా ఉండే వ్యక్తిని ”అతడు ఈ గ్రామ ప్రజలకు తలలో నాలుక వంటివాడని” కీర్తించడ మూ కద్దు. అమాయక చక్రవర్తులను ”నోట్లో నాలుక లేనివాడు” అని చెప్పడమూ వాడుకలో ఉంది. వామ నావతార ఘట్టంలో బలిచక్రవర్తి ఇలా అంటాడు. ”నిరయంబైన, నిబద్ధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు/ ర్మరణంబైన, కులాంతమైన, నిజమున్‌ రానిమ్మ, కానిమ్ముపో/ హరుడై నన్‌, హరియైన, నీరజభవుండభ్యాగ తుండై ననౌ/ తిరు గన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య! వేయేటి కిన్‌”. ఆడిన మాటను తప్పు అనడానికి ”నా జిహ్వ తిరుగ న్నేరదు” అన్నాడాయన. మాట తప్పే వాడిని అతని ‘నాలుక మడత పడింది అని, పనికిమాలిన మాటలు మాట్లాడేవాణ్ణి ‘వాడిది నాలుకా, తాటిమట్టా?’ అనీ ప్రజలు అనడం వాడుకలో ఉంది. ‘నరంలేని నాలుక ఏవైపైనా మాట్లాడుతుంది’ అంటారు. సరి యైన ఉచ్చారణలేని వాడిని ‘వాడి నాలుక మందంలే’ అంటారు.
నాలుక చక్కగా ఉంటే నాలుగు లోకా లూ మనవే. ఎందుకంటే చక్క ని వాక్పాటవం మనకు సమాజం నీరాజనం పట్టేలా చేస్తుంది.
నాలుక మనకు నేర్పే మరో సుగుణం పొదుపు. మాటలను కానీ, ఆహారాన్ని కానీ మితంగా ఉంచుకోవాలనీ పెద్దల మాట. జిహ్వ చాపల్యం అనర్థదాయకం. అనారోగ్య కరం. మితాహారం నియమిత సమయాలలో తీసుకోవడంవలన దీర్ఘాయువు పొందగలమ నీ, పురాణగాథలలో మహర్షులు కూడా నియమబద్ధమైన మితాహారం వలన దీర్ఘాయు ష్షును పొందారనీ పెద్దలు చెబుతారు. మితాహారం శరీరానికి, మితభాష ణం మనసుకు మంచి చేస్తాయి. మితభాషికి వాక్శు ద్ధి కలుగుతుందనీ, మౌనం యోగమనీ తాము ఆచరించి, బోధించిన రమణమహర్షి, వివే కానంద, గాంధీజీవంటి మహనీయులు.
నాలుకను ప్రబోధిస్తూ ఎందరో మహనీయులు మనకు సన్మార్గా న్ని సూచించారు. ఆది శంకరులిలా అన్నారు. ”సారసనా, తే నయనే, తావేవకరౌ, స ఏవ కృతకృత్య:/ యా, యే, యో, ¸° భర్గం వదతీ క్షేతే సదార్చతస్మరతి”. ఎల్లప్పుడూ పరమేశ్వరుని నామాన్ని ఉచ్చరించే నాలుకే నాలుక. శివుని దర్శించే నేత్రాలే నేత్రాలు. ఈశ్వరుని పూజించే చేతులే చేతులు. ఎల్లప్పుడూ సదాశివస్మరణ చేయువాడే కృతకృత్యుడు.
ముకుందమాలా స్తోత్రమ్‌ ”జిహ్వ! కీర్తయ కేశవమ్‌”… ఓ నాలుకా! శ్రీహరిని కీర్తించు- అని స్తుతిస్తే, సదాశివబ్రహ్మంద్రులు ”పిబరే రామ రసం, రసనే” ఓ నాలుకా! శ్రీరామనామామృతమునే తాగమని ఉద్బో ధించారు. పోతన మహాకవి కూడా ”శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ” అని అన్నారు. అనవసరంగా ఇతరులను నిందిస్తే వారి మలమూత్రాలను మన నాలుకతో శుభ్రపరచడమంత నీచమని షిర్దిసాయిబాబా సెలవి చ్చారు. మనం నిష్కారణంగా ఎవరిని నిందిస్తామో వారి పాపాలను మన ఖాతాలో జమచేసుకోవడమే అని ఆయన అభిప్రాయం. మహనీ యుల బోధనలు శిరసావహంచి మన జన్మను సార్థకం చేసుకొందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement