Saturday, April 27, 2024

TS: గర్షకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తాం.. వినోద్ కుమార్

గంగాధర, నవంబర్ 6 (ప్రభ న్యూస్) : సాంకేతిక కారణాలతో ఏర్పాటు చేయలేకపోయిన గర్శకుర్తి గ్రామాన్ని ఎన్నికల అనంతరం మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇవాళ గర్శకుర్తి గ్రామంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ… సిరిసిల్ల తర్వాత చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్న గర్షకుర్తి నేత కార్మికుల ఉపాధి కోసం బతుకమ్మ చీరల ఆర్డర్ ను జనవరి నుండి తీసుకునేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని వినోద్ కుమార్ ప్రజలకు వివరించారు.

సౌమ్యుడు, స్థానికుడు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకె రవిశంకర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వినోద్ కుమార్ ప్రజలను కోరారు. తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య విద్యతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఏర్పడిందన్నారు. లక్షలు పోసినా దొరకని సీట్లు ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చాయని వినోద్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వినోద్ కుమార్ అన్నారు. గర్షకుర్తి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చిప్ప లావణ్య చక్రపాణి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా, పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అలువాల నాగలక్ష్మి తిరుపతి ఎంపీపీ శ్రీరామ్ మధుకర్ పార్టీ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు వెలిచాల తిరుమలరావు, దూలం బాల గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మడ్లపల్లి గంగాధర్, రైతుబంధు కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, మాజీ ఎంపీపీ పడితపల్లి కిషన్, స్థానిక ఎంపీటీసీ తడిగొప్పుల రజిత రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement