Tuesday, April 30, 2024

అర్హులంద‌రికీ పింఛ‌న్లు అందిస్తాం : ఎమ్మెల్యే చ‌ల్లా

హనుమకొండ : పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో రూ.20 లక్షలతో నూతన మహిళ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన చేసిన గ్రామ సభలో వెల్లంపల్లి, పోచారం గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అర్హులందరికీ పెన్షన్ల అందిస్తాం. కొన్ని సాంకేతిక కారణాలవల్ల కొందరికి పెన్షన్లు రాలేదు. రానివారెవరు ఆందోళన చెందవద్దు. కరోనతో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల అమలు ఆపలేదన్నారు. ఆసరా పథకం ద్వారా వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్ గారిదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కోర్టుకు పోయిన బీజేపీ నాయకులు గ్రామాలకు వస్తే నిలదీయాలన్నారు. నేడు రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు, అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది. కానీ నేడు వ్యవసాయ బావుల వద్ద మీటర్లు బిగించి రైతును ఆగంచేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.

పేదింటి ఆడబిడ్డ పెళ్లి ఆ కుటుంబానికి భారం కాకూడదనే మంచి ఆలోచనతో కళ్యాణలక్ష్మి/శాదిముబారక్ పథకం ప్రవేశపెట్టి రూ.100116/- అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. దళితులను ఆర్ధికంగా బలోపేతం చేసి వారి జీవితాల్లో వెలుగులు నిమపాలనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్యాంకు ఖాతాల్లో వేస్తానన్న 15 లక్షలు, బయటికి తీస్తానన్న నల్లధనం ఇంతవరకు జాడలేదన్నారు. బ్యాంకు రుణాలు లక్షల కోట్లలో ఎగబెట్టి, బ్యాంకు లను మోసం చేసిన వారికి మాత్రం ప్రధాన మంత్రి మోదీ రుణమాఫీ చేశారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలుచేసే దమ్ములేదు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా మనమంతా నిలవాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement