Sunday, May 19, 2024

దళితులకు ఆత్మ బంధువు సీఎం కెసిఆర్ : ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

జనగామ : దళితులకు నిజమైన ఆత్మ బంధువు సీఎం కెసిఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు..గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని చిన్న మడూరులో రూ.11 కోట్ల76లక్షల79 వేలు విలువైన 23రకాల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు.. ముఖ్య అతిధిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి చిన్న మడూరు గ్రామంలో 34 డబుల్ బెడ్ రూంలు, ఎస్సి కాలనీలో 25 డబుల్ బెడ్ రూం ఇండ్లు, యశ్వంత పూర్ వాగు పై చెక్ డ్యాం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీ భవనం, చర్చి భవనం, అంతర్గత సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, మురుగు నీటి కాలువలు, మన ఊరు మన బడి పథకం కింద పాఠశాల భవనానికి ప్రహరీ గోడ, అదనపు గదుల నిర్మాణం, టాయిలెట్స్, ఇతర సదుపాయాల కల్పన వంటి పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.


అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని, ద‌ళితుల‌కు ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాలుండాల‌ని మొద‌ట పోరాటం చేసింది అంబేద్క‌రే అని కొనియాడారు..తనకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగొద్దని దేశ న్యాయ మంత్రి అయ్యాక‌ అంబేద్కర్ ద‌ళితుల‌కు రిజ‌ర్వేషన్ల‌ను క‌ల్పించారన్నారు.. తాను ఎమ్మెల్యే, మంత్రి అయ్యానంటే కేవలం అంబేద్కర్ స్పూర్తితోనే అయ్యాన‌ని ఈ సందర్బంగా గుర్తు చేసారు..ఒక్క చిన్నమాడూరు గ్రామానికి 12 కోట్లు ఖర్చు పెట్టానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని
మంత్రి ఎర్రబెల్లి అన్నారు.. చిన్న మాడూరు గ్రామ మాజీ సర్పంచ్ దళితుడైన మేడ సోమ నర్సయ్య ఇంట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోజనం చేశారు. సభలో అంబేద్కర్ పై కళాకారుల ఆటా పాటా అందరినీ ఆకట్టుకున్నాయి..ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement