Friday, May 10, 2024

బడ్జెట్ లో ఆర్టీసీకి భారీ కేటాయింపులు.. కెసిఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం..

తొర్రూరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి సముచిత ప్రాధాన్యమివ్వడం ఆనందదాయకమని తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కె రమేష్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ గురువారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేపట్టారు.ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ గతంలో ఆర్టీసీకి రూ.1500 కోట్ల మేర బడ్జెట్ ఉండగా, ఈ బడ్జెట్ లో రూ.3 వేల కోట్లు కేటాయించి సంస్థ అభివృద్ధికై ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించిందన్నారు.ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆర్‌సీ ఇవ్వనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నెల ఉద్యోగుల జీతాల కోసం రూ. 100 కోట్ల నిధులు ఇస్తూ టీఎస్ ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీకి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కార్గో సేవలను సైతం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించారన్నారు. ఆర్టీసీ సంస్థ బాగుండాల‌ని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ స‌హాయ‌, సహ‌కారాలు అందిస్తున్నారని చెప్పారు.గతంలో ఉద్యోగులు అభ‌ద్రతా భావంతో పనిచేసే వార‌ని, పాత విధానాలను ప్రభుత్వం సవరించి నూతన నిబంధనలు తీసుకొచ్చిందని వెల్లడించారు. సిబ్బంది చిన్నచిన్న త‌ప్పులు చేస్తే వాటిని డిపో మేనేజ‌ర్ స్థాయిలోనే ప‌రిష్కరించేలా ప్రభుత్వ నిబంధనలు సవరించిందన్నారు. ఈ విధానంలో సిబ్బందికి చాలా మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎఫ్ గోపాల్ రెడ్డి, ఎస్టీఐ బొయేజ్ కుమార్, మహబూబ్ రెడ్డి, ఎంసి నారాయణ, వెంకన్న, స్వామి, ఆర్ ఎస్ కుమార్, మల్లికార్జున్, కె.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement