Saturday, May 4, 2024

కేసీఆర్ తీరు హిందూ ధర్మానికే కళంకం: విజయశాంతి

సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మరోసారి మండిపడ్డారు. హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నాని మండిపడ్డారు. తెలంగాణలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్న వారిపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. చట్టాలను కాపాడవలసిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి… గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారని ఆరోపించారు. లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా మీ సయామీ ట్విన్ పార్టీ ఎంఐఎం నేతలు చట్ట విరుద్ధంగా బక్రీద్ రోజున గోవధ చేస్తామంటూ డీజీపీకి వినతిపత్రం ఇస్తే చూస్తూ ఊరుకున్నారని, ఈ లేఖ ఇచ్చిన ఎంఐఎం నేతలను వెంటనే పదవుల నుంచి తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గోవధ విషయంలో జరుగుతున్నపరిణామాలపై చర్యలు తీసుకోవాలని, గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సర్కారుదేనని ఆమె స్పష్టం చేశారు. అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజపు ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని విజయశాంతి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement