Friday, May 24, 2024

రైతు సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. న్యాయమైన ఉచిత విద్యుత్‌ను 24 గంటలపాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడుబారిన వ్యవసాయకి భూమి ప్రభుత్వం కల్పించిన సాగునీటి సాగునీటి వసతితో సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయ రంగంపై ఆధారపడి బతికే రైతుకు ఆర్థిక వెసులుబాటు కోసం, పంట అభివృద్ధికి పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. అనేక నూతన వ్యవసాయ పద్ధతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయంలో అధిక దిగుబడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఉద్యమ సమయంలో ఊరు, వాడ, పల్లె, పట్నం, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన సీఎం కేసీఆర్‌ రైతుల సమస్యలను స్వయంగా చూసి రైతుల బాధలు ఆకళింపు చేసుకున్నారు. 2014 జూన్‌లో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ సారధిగా అభివృద్ధి, సంక్షేమంపై ఉన్న అవగాహనతో సమగ్ర ప్రణాళిక రూపొందించి దశల వారీగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే రైతులు, వ్యవసాయ రంగం సమస్యలపై దృష్టి సారించారు. దేశానికే వెన్నెముక అయిన రైతన్నకు అండగా నిలువాలని ముందుగానే వ్యూహాన్ని రూపొందించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తలపెట్టారు. మొదటి ప్రభుత్వ హయాంలోనే రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి 41.46 లక్షల మంది రైతులకు చెందిన 22వేల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. గతంలోని నీటి పన్ను బకాయిలను రద్దు చేయడమే కాకుండా సాగునీటి పన్నును శాశ్వతంగా రద్దు చేసిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానికే దక్కింది.

రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టపీట వేసింది. కోటి ఎకరాలకుపైగా సాగు నీరిచ్చినది. తెలంగాణ సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచడంవల్ల పంట ఉత్పత్తి, ఉత్పదకథను అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నది. దీనికిగానూ సంవత్సరానికి రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టపర్చేందుకు ప్రభుత్వం 36,179 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో వినూత్న ఒరవడితో రైతుబంధు పథకం ప్రవేశపెట్టి పంట పెట్టుబడి సాయం చేస్తుంది. రైతులకు సాలీన ఎకరానికి సంవత్సరానికి రూ.10వేల పంట పెట్టుబడి సాయంగా అందజేస్తున్నది. రైతుబంధు కింద తొమ్మిది సీజన్లలో 65 లక్షల మంది రైతులకు రూ.57,956 కోట్లను ప్రభుత్వం అందజేసింది.

దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకం ప్రవేశపెట్టింది. వందశాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా వర్తింపజేస్తున్నది. రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబాలకు ఎల్‌ఐసీ ద్వార రూ.5 లక్షలను రైతుబీమాగా ఇస్తున్నది. ఇప్పటి వరకు 83,816 కుటుంబాలను రూ.4,161 కోట్లను రైతుబీమా ఇచ్చి అండగా నిలిచింది. నేడు రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా ఉచిత నీరు సరఫరా చేస్తున్నది. 2 కోట్ల 18 లక్షల టన్నల వరిధాన్యం ఉత్పత్తితో దేశాకిని అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. గత ఎనిమిదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తి ఎనిమిది రెట్లు పెరిగింది. నేడు వరి ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రంతో తెలంగాణ పోటీ పడుతున్నది. దేశంలోనే అత్యధికంగా ఏడువేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులు పండించిన మొత్తం వరి ధాన్యానికి మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతులకు అందిస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో విత్తనాల ధృవీకరణ చేస్తుంది. కల్తీ విత్తనాలను ఆరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. కల్తీ వ్యాపారులపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నది. రాష్ట్రంలో గోడౌన్ల సామర్థ్యం 9.9 లక్షల టన్నుల నుంచి 31.9 లక్షల టన్నులకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఐదువేల ఎకరాల భూమిని ఒక క్లస్టర్‌గా విభజిస్తూ మొత్తం 2601 క్లస్టర్లలో రూ.572 కోట్ల 88 లక్షల వ్యయంతో రైతు వేదికలను నిర్మించింది. ఆధునిక సేద్య పద్ధతులను క్షేత్రస్థాయిలోకి తెచ్చి రైతులకు చేరువ చేయడానికి వ్యవసాయ విస్తరణ అధికారులకి 17 రకాల విధులను అప్పగించింది.

వాణిజ్య పంటలు, కూరగాయలవైపు రైతులను మళ్లించడానికి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నది. వ్యవసాయంలో అధిక దిగుబడి పొందేందుకుగానూ రైతులకు సలహాలు, సూచనలు చేయడానికి విస్తరణాధికారులను నియమించింది. నూతన వ్యవసాయ పద్ధతులతో పాటు రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం నేడొక లాభదాయక రంగంగా మారింది. నాణ్యమైన ఉచిత విద్యుత్‌, సాగునీరు, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగం పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నది. రైతులు అధిక దిగుబడి పొంది ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుంది. నేడు దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ మారడానికి రైతాం సంక్షేమానికి, వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. రాష్ట్ర రైతులు దేశంలోనే ధనిక రైతులుగా అభివృద్ధి చెందుతున్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో నేడు రైతుల లోగిళ్లు ధాన్యపురాసులతో కళకళలాడుతున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement