Sunday, April 28, 2024

TS: మేడారం అటవీ ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి… ఫెర్రీ పాయింట్లపై పోలీసుల నిఘా

మేడారం (మంగపేట), ఫిబ్రవరి 21 : కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర వనితలైన వన దేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు మావోయిస్టులు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు మేడారం జాతర పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనబడుతుంది. మేడారం జాతర జరిగే సమయంలో మావోయిస్టులు జాతర పరిసర ప్రాంతాల్లో సంచరించి వీర వనితలైన సమ్మక్క సారలమ్మలతో పాటు ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు కూడా నివాళులర్పిస్తారని గత కొన్నేండ్లుగా జాతర సమయంలో ప్రచారం జరుగుతుంటుంది. సమ్మక్క కొలువైన చిలుకలగుట్టపై 2002 లో మావోయిస్టులు అమరవీరుల రెడీమెడ్ స్థూపాన్ని నిర్మించి అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించారు.

అప్పటి నుంచి గడిచిన జాతరలలో ప్రతీ జాతరకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలలోకి వచ్చి ఏదో ఒక రకంగా తమ ఉనికిని చాటుకునే వారని జాతర సమయాల్లో ప్రచారం జరిగేది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్, సోమన్న, పటేల్ సుధాకర్రెడ్డి, యాదన్న, మధు తదితరులు మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలోనే మృతిచెందారు. రెండేళ్లకొక్కసారి జరిగే మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క సారలమ్మలు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోయేందుకు మేడారాన్ని మావోయిస్టులు ఒక వేదికగా చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది.

వీర వనితలకు, మావోయిస్టు అమరవీరులకు మేడారం జాతర సమయంలో మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో నివాళులర్పించేందుకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంటుందని భావించి అటవీ ప్రాంతాలతో పాటు చత్తీస్ గడ్ నుండి మేడారం జాతరకు వచ్చే భక్తులతో కలిసి మావోయిస్టులు మేడారం వచ్చే అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, ముకునూరు, నీలంపల్లి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు), కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట నుండి మేడారం వెళ్లే వాహనాలపై, అటవీ ప్రాంతాలపై, ఫెర్రీ పాయింట్లపై పోలీసులు ప్రత్యే దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

- Advertisement -

ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణీకుల ఇబ్బందులు..
వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టాండ్ లో మేడారం జాతరకు వెళ్ళే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం కోసం గంటల కొద్ది క్యూ లైన్లలో భక్తులు వేచి చూడాల్సిన దుస్థితిని ఆర్టీసీ అధికారులు కల్పించారు. వేల కొద్ది భక్తులు ప్రయాణం కోసం వేచి ఉండగా సరిపడా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన త్రాగునీరు వసతి సైతం ఆర్టీసీ అధికారులు కల్పించకపోవడం గమనార్హం. ఆర్టీసీ అధికారులు మిగతా శాఖలతో సమన్వయం చేసుకోకపోవడం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న ఓ భక్తురాలు స్పృహ తప్పి పడిపోగా అందుబాటులో 108 అంబులెన్స్ గానీ, ఆరోగ్య శాఖ సిబ్బంది లేకపోవడం గమనార్హం. రద్దీని గమనించి అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement