Monday, April 29, 2024

గ్రామ పంచాయితీల నిధులు ఎక్క‌డ – కెసిఆర్ ని ప్ర‌శ్నించిన రేవంత్.

హైదరాబాద్‌: గ్రామ పంచాయితీల‌కు చెందిన‌ రూ.35 వేల కోట్ల సర్పంచ్‌ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించిందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు….హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ‘ నిధులు, విధులపై సర్పంచ్‌ల శంఖారావం ‘ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, పంచాయతీల అభివృద్ధి కోసం ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచ్‌లు పనులు చేశారన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించక.. కొందరు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. భిక్షాటన చేసి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని ఎద్దేవా చేశారు. గ్రామపంచాయతీల నిధులను పెద్ద గుత్తేదారులకు ఇచ్చారని, గ్రామాల్లో చెట్లు చనిపోతే సర్పంచ్‌లను సస్పెండ్‌ చేస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ లోపాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దీనిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. ఈ ఏడాది కేవలం జీతాల కోసమే ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు అప్పుతెచ్చిన కేసీఆర్ ఇంకా మూడు నెలలపాటు ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టిడిసి అధికారంలో ఉన్నా, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా సర్పంచ్‌లకు గౌరవం ఉండేదని, ఎంఆర్వో ఆఫీసుకు వెళ్లినా, ఎంపీడీవో ఆఫీసు వెళ్లినా సముచిత గౌరవం దక్కేదని అన్నారు. సమస్యను చెప్తే పిలిచి పరిష్కరించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement