Tuesday, April 30, 2024

Last Voice – “ఐ మిస్ యు మై ఫ్రెండ్స్’ – ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

చౌడాపూర్, జూలై 03(ప్రభ న్యూస్): “ఐ మిస్ యు మై ఫ్రెండ్స్” అంటూ వాట్సప్ స్టేటస్ లో మెసేజ్ పెట్టి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
నవాబుపేట్ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోస్గి మనోహర్ (16 ) అనే ఇంటర్మీడియట్ విద్యార్థి మధ్యాహ్నం 2 గంటల ఐదు నిమిషాలకు తన వాట్సప్ స్టేటస్ లో ” ఐ మిస్ యు ఫ్రెండ్స్ ” అంటూ మెసేజ్ పంపి తమ వ్యవసాయ పొలంలో గల మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్సప్ మెసేజ్ చూసిన మృతుడి చిన్నాన్న కుమారుడు భాను ప్రసాద్ ఆయనను వెతుక్కుంటూ వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లేసరికే మనోహర్ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ విషయం ఫోన్ ద్వారా మృతుడి అన్న కోస్గి మల్లేష్ కు తెలియజేయగా హుటాహుటిన అక్కడికి వెళ్లిన మల్లేష్ తమ్ముడు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందడం చూసి కన్నీరు మున్నీరయ్యారు.

తల్లి పది సంవత్సరాల క్రితం చనిపోగా తండ్రి నారాయణతోనే మృతుడు మనోహర్ చనువుగా ఉండేవాడని, తన తండ్రి తాగుడుకు బానిసై తన తమ్ముడిని పట్టించుకోకపోవడంతో మానసిక వేదనకు గురై తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన సోదరుడు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై పురుషోత్తం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement