Friday, May 3, 2024

తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం – .కె.వి.రమణాచారి

తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని, పుస్తకాలను శ్రద్ధతో, ఇష్టంతో చదవడం అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కె.వి. రమణాచారి అన్నారు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో Full bright global teacher grant project (America) వారి సహకారంతో ఈరోజు నుండి ఈ నెల 7 వ తేదీ వరకు నిర్వహించనున్న చదువుల పండుగ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులపాటు 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత, పుస్తక పఠనం,ఆకర్షణీయమైన చేతిరాత, విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసము, నీతి కథలు, ఆంగ్లంపై స్వగ్రామమైన నారాయణపూర్ గ్రామంలో విద్యార్థులు, గ్రామస్థులతో మమేకమై తమ అనుభవాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. నాలుగు గోడల మధ్య గల తరగతి గది పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సమయం ఎంతో విలువైనది, ముఖ్యమైనదని, విద్యార్థులు ఏ సమయంలో చేయాల్సిన పని అదే సమయంలో చేయాలని, గడిచిన సమయం తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. గొప్ప సాహితీ వేత్తలను, ఉపాధ్యాయులను, ఇతర ఉద్యోగులను అందించిన గడ్డ నారాయణపూర్ అని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామానికి దక్కని ఖ్యాతి, గౌరవం నారాయణపూర్ గ్రామానికి దక్కిందని తెలిపారు.

విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలతో పాటు, గొప్ప వారి జీవిత చరిత్రలను, ఇతర కథల పుస్తకాలను చదవాలని అన్నారు. ప్రస్తుతం విద్యార్థుల చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తుందని, తాము చదువుకున్న రోజుల్లో ఈ సౌకర్యాలు లేవని చెప్పారు. ధనంతో పాటు ధర్మంగా ఉండాలి అనే విషయం విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement